
ఏడాది కూటమి పాలనలో ఏం సాధించారో చెప్పాలి
అట్లూరు : కేంద్రంలో, రాష్ట్రంలో ఏడాది కూటమి పాలనలో ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య ప్రశ్నించారు. గురువారం బద్వేలు పట్టణంలోని సీపీఐ కార్యాలయం జేవీ భవన్లో నిర్వహించిన ఆ పార్టీ పట్టణ మహాసభలలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ అనే గొప్పలు చెప్పుకుంటూ ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తికి నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు ఆచరణలో అమలు కాలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, ఏరియా సహాయ కార్యదర్శి పి.మస్తాన్, పట్టణ కార్యదర్శి బాబు తదితరులు పాల్గొన్నారు.