
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో రుచికరమైన భోజనం అందించాలని పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక రాష్ట్ర డైరెక్టర్ మధుసూదన్ రావు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆయన స్వయంగా భోజనం తిని నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ చేసినందున విద్యార్థులు ఎలా తింటున్నారని అడిగి తెలుసుకున్నారు.
వంటల నిర్వాహకులు పరిశుభ్రంగా ఉండాలని, వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మండలానికి వచ్చిన పాఠ్య పుస్తకాలు, విద్యా సామాగ్రిని ఆయన పరిశీలించారు. పాఠ్య పుస్తకాలన్నింటిని పాఠశాలలకు సరఫరా చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎంఈఓ శోభారాణి, అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం గీత, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
గడ్డిమందు తాగి వ్యక్తి మృతి
కాశినాయన : మండలంలోని కొండ్రాజుపల్లె గ్రామానికి చెందిన కుమారి రమణయ్య (52) అనే వ్యక్తి గడ్డి మందు తాగి మృతి చెందాడు. కాశినాయన ఎస్ఐ యోగేంద్ర తెలిపిన వివరాల మేరకు.. మృతుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడని, దీంతో పాటు అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఈనెల 10న గడ్డి మందు తాగాడు. వెంటనే అతన్ని పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి కడపలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా గురువారం రమణయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య సుబ్బలక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
వృద్ధురాలి అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం : పట్టణానికి చెందిన నాగమ్మ అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగమ్మ మే 27న స్థానిక రామేశ్వరం మునిస్వామి దేవస్థానం ఎదురు వీధిలో ఉన్న తన చిన్న కుమారుడు గంగాధర్ ఇంటి నుంచి మనస్థాపంతో వెళ్లిపోయిందని కుమారులు గంగాధర్, బాబులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : మోరగుడి గ్రామానికి చెందిన చాకలి అంకాలయ్య (38) అనే వ్యక్తి గురు వారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణ ఎస్ఐ హైమావతి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని మోరగుడి గ్రామానికి చెందిన చాకలి అంకలయ్య గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి మద్యం తాగా డు. గురువారం ఆరోగ్యం సరిగా లేదని సోదరుడి కుమారుడు యోగేశ్వర్కుతో మాత్రలు తెప్పించుకున్నాడు. మాత్రలు వేసుకున్న తరువాత ఆయాసం ఎక్కువ కావడంతో వెంటనే తమ్ముడు సంజీవకు సమాచారం ఇచ్చారు. ఆటోలో జమ్మలమడుగులో ని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా ముక్కులో నుంచి రక్తస్రావమైంది. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.