
రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం
జమ్మలమడుగు : రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు పొగాకు, పత్తి పంటలను సాగు చేసుకోమని ప్రోత్సహించిందని, పంట చేతికి వచ్చిన తర్వాత సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. గురువారం జమ్మలమడుగులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలిలో పర్యటిస్తే ఆయనపై కూటమి నాయకులు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ప్రతి పనికి కప్పం కట్టించుకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితులు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడంతో వైఎస్సార్సీపీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తే వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలిపారన్నారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటుధరతోపాటు రైతులకు ఆర్బీకే సెంటర్ల ద్వార నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నేరుగా గ్రామాలలోనే ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని ఇలాగే ఉంటే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, రైతు నాయకులు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, విష్ణువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి