
చదువుతోపాటు నైతిక విలువలు నేర్పాలి
ప్రొద్దుటూరు రూరల్ : పిల్లలకు చదువుతోపాటు నైతిక విలువలు నేర్పాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. గత నెల 23వ తేదీన వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబ సభ్యులను గురువారం ప్రొద్దుటూరు మండలం అమృతానగర్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ పరామర్శించారు. హత్యకు గురైన చిన్నారి తల్లి స్నేహతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను పని వద్ద నుంచి ఇంటికి వచ్చే సరికి తన కూతురు గుండెలపై కూర్చొని ముద్దు ముద్దు మాటలతో నవ్విస్తూ ఉండేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి ఫొటోలను చైర్పర్సన్కు చూపించి స్నేహ విలపించారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ నిందితుడు తనకు తాను శిక్ష వేసుకున్నా హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తరపున రూ.4,12,500 చెక్కు అందించామని, మరో రూ.4.5 లక్షలు త్వరలోనే ఇస్తామన్నారు. కాగా చిన్నారి తండ్రి చెన్నయ్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బంధువులు కోరారు. ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, ప్రొద్దుటూరు, మైదుకూరు డీఎస్పీలు భావన, భవాని, తహసీల్దార్ గంగయ్య, ఐసీడీఎస్ రూరల్ సీడీపీఓ అరుణకుమారి పాల్గొన్నారు.