
చంద్రబాబు ఏడాది పాలనలో సాధించిందేమీ లేదు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఏడాది పాలనలో గొప్పలు చెప్పడం తప్ప సాధించింది ఏమీ లేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. గురువారం కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా సూపర్ సిక్స్కు, ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటి వరకు దిక్కులేదన్నారు. ఉచిత ప్రయాణంపై పండుగల పేరు చెప్పి కాలయాపన చేశారన్నారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలకు దిక్కులేదన్నారు. రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 ఏళ్ల కాలపరిమితికి సంబంధించిందని, ఇష్టం వచ్చినప్పుడు అమలు చేయడం కాదన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 67 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇస్తూ 20 లక్షల మంది విద్యార్థులను మోసం చేశారన్నారు. అన్నదాత సుఖీభవ మోసమేనన్నారు. రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉండగా, కత్తెర పేరుతో 45 లక్షల మంది రైతులకు ఇస్తున్నారన్నారు. ప్రతి నిరుద్యోగికి రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదన్నారు. చంద్రబాబు సాధించిన ప్రగతి అప్పులు తీసుకోవడం, బీజేపీకి ఊడిగం చేయడమేనని ధ్వజమెత్తారు. బీజేపీని వ్యతిరేకించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపాటు