
నేడు, రేపు స్టూడెంట్ పాసుల జారీ ఉండదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాండు కౌంటర్లలో విద్యార్థులకు బస్సు పాసులను గురు, శుక్రవారాల్లో జారీ చేయబోరని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. సెలవుల అనంతరం స్కూళ్లు, కళాశాలలు పునః ప్రారంభించే సమయంలో విద్యార్థులకు కొత్త బస్సు పాసులను ఈనెల 14 నుంచి జారీ చేస్తామన్నారు. బస్సు పాసులను పొందే విద్యార్థులు తమ వివరాలను ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ బస్సుపాస్ డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న తర్వాత జనరేట్ అయిన పిన్ నెంబరు కౌంటర్లో తెలియజేస్తూ బస్సు పాసుకోసం క్యూలైన్లో వేచి ఉండే సమయం తగ్గుతుందన్నారు. నమోదు ప్రక్రియ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చని సూచించారు.
కమనీయం..కల్యాణం
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో జేష్టమాసం పౌర్ణమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వసేవపూజ, కంకణ పూజ, యజ్ఞోపవీతధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించి తరించారు.
రిమ్స్ సూపరింటెండెంట్గా కె.ఎస్.ఎస్. వెంకటేశ్వరరావు
కడప అర్బన్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) సూపరింటెండెంట్గా డాక్టర్ కె.ఎస్.ఎస్. వెంకటేశ్వరరావును నియమిస్తూ ఇటీవల డీఎంఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. గతంలో కడప రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ అనంతపురం జీజీహెచ్కు వెళ్లారు. ప్రస్తుతం తిరిగి కడప రిమ్స్ సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. నేడో,రేపో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా దాసరి రమణయ్య
కడప అర్బన్: ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా మాజీ సైనిక సంఘం నూతన అధ్యక్షుడిగా సుబేదార్ దాసరి రమణయ్యను ఎన్నుకున్నారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం వద్ద బుధవారం వైఎస్సార్ కడప జిల్లా మాజీ సైనికుల సంఘం (డీఈఎస్ఎంఏ) సమావేశం నిర్వహించారు. గతంలో మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న పువ్వాడ లక్ష్మీనారాయణ ఈ ఏడాది మార్చి 19న మరణించారు. ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ కెప్టెన్ ఎస్.ఎస్. రాముడు, మాజీ వారెంట్ ఆఫీసర్ బి.వి.రంగయ్య, ప్రధాన కార్యదర్శి బి.వి. గోపాల్రెడ్డి, ఇతర మాజీ సైనికులు పాల్గొన్నారు.
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా
రాజంపేట: మామిడిరైతులకు గిట్టుబాటుధర కల్పించాలని బుధవారం రాజంపేట వ్యవసాయ మార్కెట్యార్డులో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సంఘంనేతలు పందికాళ్ల మణి, చిట్వేలి రవి మాట్లాడుతూ మామిడిరైతులను ఆదుకోవాలని, ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రైవేటు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలు దాదాపు 200 ఉన్నాయ న్నారు. వారు సిండికేట్గా ఏర్పడి గతంలో ఉన్న ధరల కన్నా సగానికి తగ్గించి వేశారన్నారు. చిత్తూరు కలెక్టర్ తోతాపూరి కేజీ రూ. 12గా ధర నిర్ణయించారన్నారు. ఆ ధర అమలు కావడంలేదన్నారు. రూ.6తో కోనుగోలు చేస్తున్నారన్నారు. గతంలో రూ.15వేల ఉన్న తోతాపురి కాయలు టన్ను రూ.6వేలకు కొనుగోలుచేశారన్నారు. ఈ ఏడాది మామిడికాపు తక్కువగా ఉందని, ధర పెరగాల్సి ఉందన్నారు.

నేడు, రేపు స్టూడెంట్ పాసుల జారీ ఉండదు

నేడు, రేపు స్టూడెంట్ పాసుల జారీ ఉండదు

నేడు, రేపు స్టూడెంట్ పాసుల జారీ ఉండదు