
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
కడప కార్పొరేషన్: వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ కె. గురవయ్య ఆదేశించారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్లోని సమావేశ భవనంలో డీఈలు, ఏఏఓలు, జేఏఓలతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు పాతరిమ్స్లోని 33/11 కేవీ సబ్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు లేకుండా నాణ్యమైన సరఫరా చేయాలని, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్లో ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. ప్రధాన మంత్రి సౌర విద్యుత్ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంటి పైకప్పుపై సోలార్ ఫలకలు పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ పథకంలో బీసీలకు అదనంగా రూ.28వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను అరికట్టాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన వెంటనే సంస్థ ఖర్చులతో మరమ్మతులు చేయించాలన్నారు. ఇళ్లకు, వాణిజ్య సముదాయలకు, పరిశ్రమలకు దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ సరఫరా ఇవ్వాలన్నారు. 50 శాతం డెవలప్మెంట్ చార్జెస్ మాత్రమే చెల్లించి తమ అదనపు లోడ్ క్రమబద్ధీకరణ చేసుకునే పథకం ఈ నెల 30 తో ముగియనుందని దానిని ఉపయోగించుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ, ఈఈ హరిసేవ్యా నాయక్, టెక్నికల్ ఈఈ మధుసూదన్, డీఈఈలు, ఏఏఓలు, ఏఈలు, జేఏఓలు పాల్గొన్నారు.
ఏపీఎస్పీడీసీఎల్
టెక్నికల్ డైరెక్టర్ కె. గురవయ్య