
వైఫల్యం కప్పిపుచ్చుకొనేందుకే దాడులు
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రజలకు వాక్ స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి.అంజద్బాషా ధ్వజమెత్తారు. కడపలోని తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏదైనా పెద్ద సమస్య జరిగితే దాని నుంచి ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఐదు దశాబ్దాలుగా జర్నలిస్టుగా ఉన్నారని, పలు పత్రికల్లో, టీవీల్లో ఆయన పనిచేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొమ్మినేని డిబేట్ షోలకు ప్రజాదరణ ఉందని, ఆయనంటే చంద్రబాబుకు పడదన్నారు. 2014లో ఎన్టీవీ ప్రసారాలు బంద్ చేస్తామని బెదిరించి ఆయన్ను తొలగించేలా చేశారని గుర్తుచేశారు. టీవీల్లో డిబేట్లు జరిగినపుడు పాల్గొన్న విశ్లేషకులు రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటార న్నారు. ఇందులో భాగంగానే క్రిష్ణంరాజు అమరావతి పరిసరాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. క్రిష్ణంరాజుతోపాటు కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి ఛానెల్ కూడా క్షమాపణ కోరిందన్నారు. అయితే టీడీపీ నేతలు ఇంతటితో ఆగకుండా సాక్షి ఛానెల్, వైఎస్ జగన్ను, వైఎస్ భారతిలను ఇందులోకి లాగడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా ఏ హామీలు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందన్నారు. ‘వెన్నుపోటు దినం’ విజయవంతం కావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు ఓ కల్పిత ఉద్యమాన్ని సృష్టించి సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి, కొమ్మినేనిని అరెస్ట్ చేయించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీవీ5, ఏబీఎన్, మహా టీవీలలో సాంబశివరావు, వెంకటక్రిష్ణ, రాధాక్రిష్ణ, వంశీక్రిష్ణలాంటి వారు విషం కక్కుతూ ఎన్నో వ్యాఖ్యలు చేశారని, ఆ రోజున వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని ఇలా వేధించలేదన్నారు. ఫేక్ ఐడీలతో కిరాక్ ఆర్పీ, సీమరాజా వంటివారు బండబూతులు తిడుతున్నా వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో దళిత మైనర్ బాలికను నెలల తరబడి గ్యాంగ్ రేప్చేసి హత్య చేయడం చూస్తుంటే అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్సార్సీపీకి మద్దతిచ్చే వారిపై అక్రమ కేసులు బనాయించి, టీడీపీ నాయకులను కాపాడటానికే పోలీసు వ్యవస్థ ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, మున్సిపల్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి, ౖషఫీ, జోన్ అధ్యక్షుడు తోటక్రిష్ణ, కంచుపాటి బాబు, అబ్దుల్ సుభాన్, డీజే అక్బర్, తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్ అక్రమం
టీడీపీ నేతలదంతా కల్పిత ఉద్యమం
మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా