
చదువుకొనేదెలా..!
●పెరిగిన ధరలు
ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు ఇక పాఠశాల బాట పట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ (గురువారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.ఈ ఏడాది కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 10 నుంచి 20 శాతం వరకు ఫీజులు పెంచినట్లు తెలిసింది. అదే విధంగా పుస్తకాల ధరలు భారీగా పెరిగాయి. 6వ తరగతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, బూట్లు, టై వంటికి గతేడాది 6 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ. 8 వేల దాకా అవుతోందని తల్లిదండ్రులు అంటున్నారు. వీటితోపాటు పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు, అట్టలు వంటి అదనపు ఖర్చులు మరింత భారం అవుతున్నాయని వారు వాపోతున్నారు. ఇలా అన్ని కలిపి గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా రూ.5 వేలు నుంచి రూ.10 వేల దాకా ఖర్చు పెరిగిందని ఆవేదన చెందుతున్నారు.
కడప ఎడ్యుకేషన్: జూన్ నెలంటేనే పేద, మధ్య తరగతి ప్రజల గుండె గుబేల్మంటుంది. ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ప్రతి ఒక్కరూ చదువులకు సంబంధించి పుస్తకాలు, స్కూల్ యానిఫాం, బూట్లు, టై, బెల్ట్, బ్యాగులు ఇలా అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయాల్సి రావడంతో తల్లిదండ్రులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇలా జూన్ నెలలో అన్ని రకాల వస్తువులను ఒకే సారి కొనుగోలు చేయాల్సి రావడంతో.. ఒక్కసారిగా ఆర్థిక భారం పడుతోంది. నర్సరీ మొదలుకుని కళాశాల విద్య వరకు వేలాది రూపాయలు పోసి చదువులను కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయని, అయినా కానీ అప్పోసప్పో చేసి పిల్లలను బడిలో చేర్పించాల్సి వస్తోందనని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన తల్లికి వందనం కూడా ఇవ్వకపోవడంతో మరింత ఆర్థిక భారం పడుతోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలు తెరిచేనాటికి పిల్లలకు తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
ముందు నుంచే అడ్మిషన్లు
ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్లు ప్రారంభించాయి. దీంతోపాటు వేసవి సెలవుల్లో తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాఠశాలల్లో పని చేసే సిబ్బందికి కూడా అడ్మిషన్లకు సంబంధించి లక్ష్యం విధించి వేధించారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళళన చేసినా.. పట్టించుకునే వారు కరువయ్యారు.
వ్యాపార కేంద్రాలుగా..
సరస్వతీ నిలయాలుగా విరాజిల్లాల్సిన ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు నేడు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. ఫలితంగా సగటు జీవి తన పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలంటే గుండె గుబేల్మంటుంది. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను బాగా చదివించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఆశతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రుల చెవులు పిండి క్యాష్ చేసుకుంటున్నారు. అడ్మిషన్ ఫీజు మొదలుకుని టై, షూ, బెల్టులతోపాటు పుస్తకాల వరకూ అన్ని వారే సరఫరా చేస్తున్నారనే విమర్శలు మెండుగా ఉన్నాయి.
కూలి పని చేసుకునే స్థాయి నుంచి..
కూలి పని చేసుకునే వాడి దగ్గరి నుంచి వ్యాపారం చేసుకునే వారి వరకు, అటెండర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను కాన్వెంట్ చదువులను చదివించాలని ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వారు ఏటా ఫీజులు పెంచుతున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన అధికారుల చేష్టలుడిగి ప్రవర్తించడంతో.. అది కాస్తా పేద, బడుగు, బలహీల వర్గాల వారికి పెనుభారంగా మారుతూ అప్పుల ఊబిలోకి వెళుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితమైనా...
పులిని చూసి నక్క వాత పెట్టుకున్న సామెత లాగా.. సామాన్య, మధ్య తరగతుల వారు కూడా తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్లో చదివించాలనే ఆశతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయినా సరే తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు పంపేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితంగా అందిస్తున్నారు. క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన జరుగుతోంది. అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు.
1 నుంచి 5వ తరగతి విద్యార్థుల పుస్తకాల ధరలు:
రూ.5 వేల నుంచి రూ.10 వేలు వరకు
6 నుంచి 10వ తరగతి పుస్తకాలు:
రూ. 8 నుంచి 12 వేల వరకు
యూనిఫాం మూడు జతలు:
రూ.1500 నుంచి 2 వేల వరకు
షూ, టై, బెల్ట్ తదితర వస్తువులు:
రూ.500 నుంచి 1000 వరకు
మార్కెట్ ధరల కంటే అధికంగా..
విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల్లో చేరిన తర్వాత విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు మొదలుకొని యూనిఫాం, టై, బెల్ట్, షూ వంటి వాటిని కచ్చితంగా కొనుగో లు చేయాల్సిందే. అదే అదునుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు సంబంధిత వస్తువులను వారి పాఠశాలలో ఏర్పాటు చేసుకుని బహిరంగ మార్కెట్ కంటే అధిక రేట్లతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విద్యార్థి సంఘ నాయకులు విమర్శిస్తున్నారు.
భయ పెడుతున్న బడి ఫీజు
ప్రైవేటు, కార్పొరేట్లో భారీగా పెరిగిన వైనం
తడిసి మోపెడు అవుతున్న స్కూల్ ఖర్చులు
సామాన్యులకు భారంగా విద్య
అయినా కాన్వెంటు వైపే మొగ్గు
రేపు పాఠశాలలు పునఃప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుంది. అపారమైన అనుభవంతోపాటు అర్హత గల ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే ఇంగ్లిష్ మీడియం ఉంది. ప్రభుత్వం విద్యా సామగ్రి ఉచితంగానే అందిస్తుంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఆర్భాటాలు చూసి తల్లిదండ్రులు మోసపోవద్దు. తమ ిపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ, అధికారి

చదువుకొనేదెలా..!

చదువుకొనేదెలా..!