
షట్డౌన్ దిశగా అల్ట్రాటెక్!
పరిశ్రమ మూసేస్తే.. మా పరిస్థితి ఏంటి?
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, క్షేత్రస్థాయిలో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వేధింపులు వెరసి అల్ట్రాటెక్ పరిశ్రమ యాజమాన్యం షట్డౌన్ దిశగా అడుగులు వేస్తోందా? అని ప్రశ్నిస్తే ఔను అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 48 రోజులుగా అల్ట్రాటెక్లో సిమెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులు, పర్మినెంట్ ఉద్యోగులను పరిశ్రమలోకి వెళ్లకుండా అడ్డుతగులుతున్నారు. స్వయంగా పోలీసు అధికారులు దగ్గరుండీ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈక్రమంలో పరిశ్రమ నిర్వహణ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.
● చిలంకూరు అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ యాజమాన్యం తలొగ్గి బతిమాలాడాలనే తలంపుతో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఉన్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అందుకోసం అధికార దుర్వినియోగం ఎలా చేయాలో అంతా సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. ఓవైపు అనుచరులు, మరోవైపు పోలీసులను కాపలాగా పెట్టి వలసపల్లె, కర్చుకుంటుపల్లె, తుమ్మలపల్లె, దేవగుడి గ్రామాలకు చెందిన ఎమ్మెల్యే అనుచరులు అక్కడే తిష్టవేసి పర్మినెంట్ ఉద్యోగులను సైతం విధుల్లోకి వెళ్లనీయడం లేదని పలువురు వాపోతున్నారు. అదేమంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుతోందని స్వయంగా పోలీసు అధికారులు అడ్డుతుగులుతున్నట్లు తెలుస్తోంది. ఆ సాకు చెబుతూ విధులకు హాజర కాకుండా అడ్డగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలని ఉచిత సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే తమ సీఐ ఇరువురి మధ్య పరిష్కారం చూపుతారంటూ యర్రగుంట్ల సర్కిల్ కార్యాలయానికి చెందిన కింది స్థాయి పోలీసు అధికారులు చెబుతున్నట్లు యాజమాన్య ప్రతినిధులు వివరిస్తున్నారు. ఇది వరకు ముడిఖనిజం సరఫరా చేసే టిప్పర్లపై కేసులు నమోదు చేసి వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. అధికారులు అలా ఎమ్మెల్యేకు అండగా సహకరిస్తుంటే, మరోవైపు ప్యాంకింగ్ ఫ్లాంట్ను దక్కించుకొని యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్యాకింగ్ ప్లాంట్ మూసివేశారు. వెరసి 48 రోజులుగా సిమెంటు ఉత్పత్తి ఆగిపోయింది.
‘రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే అన్నీ అనుమతులు ఇచ్చి రికార్డు టైమ్లో దాన్ని అమల్లోకి తెచ్చేందుకు బాధ్యత తీసుకుంటున్నాను. మీరంతా సమీప భవిష్యత్లో కనీసం ఒక్క వ్యాపారమైనా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాలి.’ సీఎం చంద్రబాబు ఇటీవల సీసీఐ చర్చాగోష్టిలో పారిశ్రామికవేత్తలతో అన్నమాటలివి. నోటితో చెప్పడం నొసలుతో వెక్కిరించడం, దేని పని దానిదే అన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మాటలకు, చర్యలకు పొంతన ఉండదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఊదాహరణగా చిలంకూరు అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ నిలుస్తోందని పలువురు చెప్పుకొస్తున్నారు. ఉత్పత్తిలో పొలిటికల్ వాటాలు ఇవ్వాల్సిందేనని నిక్కచ్చిగా సీఎంఓ పేర్కొనడంతోనే సమస్య జఠిలంగా మారినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల పట్ల చిత్తశుద్ధి ఉంటే అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోతుందా? 48 రోజులుగా సిమెంటు ఉత్పత్తి నిలిచిపోతే జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఎవ్వరికీ పట్టకపోవడం గమనార్హం. సీఎం చంద్రబాబు సర్కార్లో రాజధాని నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎవరి వాటాలు వారికి దక్కించుకునేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
జమ్మలమడుగు : తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్యాకింగ్ యూనిట్లో పని చేస్తున్న కార్మికులు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ గేటు వద్ద వారం రోజుల నుంచి నిరసనలు తెలియజేస్తూ.. ఎవరూ లోనికి పోకుండా అడ్డుకుంటున్నారు. అయితే రెండు రోజుల నుంచి ఐసీఎల్ (అల్ట్రాటెక్) పరిశ్రమలో పని చేస్తున్న మెయింటెనెన్స్ కార్మికులు, ఇతర కార్మికులు తమ విధులకు హాజరు కావాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు తమ పని చేయడం కోసం పరిశ్రమ వద్దకు వెళ్లారు. నిరసన చేస్తున్న కార్మికులు.. లోనికి వెళ్లవద్దు అంటూ అడ్డుకున్నారు. తమని ఎందుకు అడ్డుకుంటున్నారు, తమ పని చేసుకోనివ్వండి పరిశ్రమలు ఇక్కడి నుంచి తరలిపోతే మా పరిస్థితి ఏమిటంటూ వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కార్మికులు, నిరసన కారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు.
చెప్పేందుకే నీతులు
కొనసాగుతున్న కూటమి ఎమ్మెల్యే వేధింపులు
కార్మికులు పరిశ్రమలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వైనం
పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు ముప్పుతిప్పలు
ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువు

షట్డౌన్ దిశగా అల్ట్రాటెక్!

షట్డౌన్ దిశగా అల్ట్రాటెక్!