
‘సాక్షి’ కార్యాలయం వద్ద ఆందోళనపై ఫిర్యాదు
టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
చింతకొమ్మదిన్నె: కడప సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద జూన్ 9వ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రజాస్వామికంగా ధర్నా చేయడం దారుణమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సాక్షి బ్రాంచ్ మేనేజర్ హరినాథ్రెడ్డి, కడప రిపోర్టర్ దుర్గాప్రసాద్, చింతకొమ్మదిన్నె రిపోర్టర్ నాగమల్లారెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు వారు మంగళవారం చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్లో సీఐ శివశంకర్ నాయక్ను కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. సాక్షి టీవీలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించి, క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. అయినా టీడీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయాలని పిలుపునివ్వడం దారుణం అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై సాక్షి కథనాలు ప్రచురిస్తుండటంతోనే కక్ష గట్టారని పేర్కొన్నారు. కడపలోని సాక్షి కార్యాలయం లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన టీడీపీ దుండగులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు చేసిన హంగామా సీసీ కెమెరాలలో రికార్డు అయిందని, ప్రత్యక్ష సాక్షులు సైతం ఉన్నారని, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమ కార్యాలయం వద్ద ధర్నా చేయడంతోపాటు సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. దీనివల్ల సిబ్బంది ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.