
అంతుచిక్కని రహస్యం
కడప కార్పొరేషన్ : కడప మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాలులో ఏముంది...హాలు తాళాలు ఎవరి వద్ద ఉన్నాయి...కౌన్సిల్ హాలును తెరవకుండా ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంసమవుతున్నాయి. మేయర్ సురేష్ బాబు తన విచక్షణాధికారంతో వేదికపై ఉన్న కుర్చీలను తొలగించడంతో కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి గత రెండు సమావేశాల్లో రచ్చ రచ్చ చేసి హంగామా సృషించారు. తనకు మేయర్తో సమానంగా వేదికపై కుర్చీ వేసేవరకూ సమావేశాలు జరుగనివ్వనని హెచ్చరించారు. దీంతో ముజువాణి ఓటుతో మేయర్ అన్ని అంశాలను ఆమోదించారు. ఇప్పటికి సుమారు నాలుగు నెలలుగా నగరపాలక సర్వసభ్య సమావేశం జరగలేదు. కమిషనర్ మనోజ్రెడ్డి కౌన్సిల్ హాలులో ఎక్స్ అఫిషియో సభ్యులైన కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు ఏర్పాటు చేసి తాళాలు తన వద్ద ఉంచుకున్నారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. గతంలోనే కౌన్సిల్ హాలును తెరిపించాలని కోరితే కమిషనర్ తన వద్ద తాళాలు లేవని చెప్పినట్లు సమాచారం. తాజాగా 3 నెలలు పూర్తయిన నేపథ్యంలో అత్యవసరంగా కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరపాల్సిన ఆవశ్యకత ఉందని, కౌన్సిల్ హాలులో కనీస వసతుల కల్పనకు పరిశీలించాల్సి ఉన్నందున దానిని వెంటనే తెరిపించాలని మేయర్ సురేష్ బాబు స్వయంగా తన లెటర్ హెడ్లో కమిషనర్ను కోరారు. మేయర్ ఇచ్చిన లేఖను వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సోమవారం కమిషనర్ మనోజ్రెడ్డికి అందజేశారు. అయితే కమిషనర్ సమావేశం జరిగే రోజునే కౌన్సిల్ హాలు తెరుస్తామని, అంతవరకూ తెరిచే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది.
కుర్చీ చుట్టూ తిరుగుతున్న రాజకీయం
కడప నగరపాలక సంస్థలో ప్రజల ఓట్లతో గెలుపొందిన మేయర్, కార్పొరేటర్లకు తగిన గౌరవమిచ్చి వారి సలహాలు, సూచనలకు అనుగుణంగా పాలన చేయాల్సిన కమిషనర్, ఇతర అధికారులు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్. మాధవి ఆదేశాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ నేతలను కక్షసాధించడంలో కమిషనర్ భాగస్వాములైనట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏర్పాటు చేసుకున్న వాటర్ప్లాంట్లను తొలగించడం, ఆక్రమణల పేరిట ఆ పార్టీ నాయకుల షాపులను తొలగించడం, వార్డు సచివాలయాల్లో కార్పొరేటర్లకు ఏర్పాటు చేసిన కుర్చీలు, ఛాంబర్లను తొలగించడం వంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. కమిషనర్ ఆదేశాలతోనే ఇవన్నీ జరిగినట్లు కార్పొరేటర్లు భావిస్తున్నారు. మహానాడు సందర్భంగా కడపలో విచ్చలవిడిగా వారం రోజులపాటు ఫ్లెక్సీలు, హోర్డింగులు, వెలసినా కార్పొరేషన్కు మాత్రం రూపాయి ఆదాయం కూడా సమకూరలేదు. సామాన్య టీడీపీ నేతలు వినతులు ఇవ్వడానికి వస్తే లేచినిలబడి వినయ విధేయతలు చూపుతున్న కమిషనర్, కార్పొరేటర్లు వినతులు ఇవ్వడానికి పోతే కనీసం లేచి నిలబడలేదన్న విమర్శలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం మేయర్కు తప్ప ఆయనతో సమానంగా ఎక్కడా ఎవరికీ కుర్చీలు ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రాల్లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే కడప నగరపాలక సంస్థలో అందుకు విరుద్దంగా మేయర్కు మాట మాత్రమైనా చెప్పకుండా... తనకే అన్ని విచక్షణాధికారాలు ఉన్నట్లు కమిషనర్ అత్యుత్సాహంతో మేయర్తో సమానంగా వేదికపై ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.కమిషనర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా అవేవీ ఆయన పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే కమిషనర్ ఇలా చేశారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అదే గనుక నిజమైతే దానిపై మేయర్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏ విధంగా స్పందిస్తారో...ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
సుమారు నాలుగు నెలలుగా
కొనసాగుతున్న సస్పెన్స్
తాజాగా మున్సిపల్ కౌన్సిల్ హాలు తెరిపించాలని కోరిన మేయర్
అంగీకరించని కమిషనర్...
సర్వత్రా విమర్శలు