
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది
పులివెందుల రూరల్ : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, పగలు కొన్ని రోజులు, చీకటి కొన్ని రోజులు ఉంటాయని, ఇచ్చిన హామీలు ఏడాది పూర్తయినా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని, రాష్ట్రంలో మంత్రి లోకేష్ రాజ్యాంగం నడుస్తోందని, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పులివెందుల సబ్ జైలులో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కూటమి నాయకులు ఎల్లో తోరణాలు కట్టడం దారుణమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు తోరణాలు కట్టారని వైఎస్సార్సీపీ నాయకులు డీఎస్పీ, కమిషనర్లనకు వినతి పత్రాలు కూడా అందజేశారన్నారు. అయినా కూడా పట్టించుకున్నా పాపానపోలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని ఇది అధికారులు గుర్తుపెట్టుకుని పనిచేయాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టిన నాయకులు, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బ్యానర్లు, తోరణాలు తొలగిస్తే దానికి సంబంధించిన కేసు పెట్టకుండా 307 కేసు పెట్టడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలోరాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకతీతంగా పనిచేసి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్టు చేసి ఉంటే ఎవరూ ఉండేవారు కాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సునీల్ కుమార్, వీరప్రతాప్రెడ్డి, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళిక ప్రకారమే కొమ్మినేని అరెస్ట్
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారమే సాక్షి ఛానెల్ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిందని వైఎస్సార్సీపీ జి ల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాక్షి ఛానెల్ డిబేట్లో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. వాటిని సాక్షి ఛానెల్కు, డిబేట్ నిర్వహిస్తున్న యాంకర్కు అంటగట్టడం సరికాదన్నారు. దీనికి సాక్షి యాజమాన్యం, కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనలు, దాడులు చేయించి కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి