
బాబు మార్కు రాజకీయానికి.. ఆ ముగ్గురు బలి!
రాజంపేట : గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం ఓటమిపాలై, పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని..ఇన్చార్జి పదవి విషయంలో అధిష్టానం వెనకడుగు వేసిన తరుణంలో ఆయన ఆ పార్టీకి గుడ్బై చెప్పడంతో.. చంద్రబాబు రాజకీయంలో మరో నేత బలయ్యారనే వాదన ఆ పార్టీ క్యాడర్లో వినిపిస్తోంది. దివంగత మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు బాటలో సుగవాసి కూడా చేరిపోయారనేది ఇప్పుడు కూటమి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
యూజ్ అండ్ త్రో పాలిట్రిక్స్..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాలానుగుణంగా రాజకీయాలు చేస్తారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. వాడుకోవడం పక్కన పెట్టడం, విభజించి పాలించడం లాంటి విధానాలతో రాజంపేట టీడీపీ వర్గ విభేదాలకు నిలయంగా మారిపోయిందని రాజకీయ పరిశీలకుల భావన. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న నేతలను తన కష్ట కాలంలో బాగానే ఉపయోగించుకున్నప్పటికి, అందలమెక్కిన తర్వాత వారిని డస్ట్బిన్లో వేసే విధానం పార్టీ ఆవిర్భావం నుంచి రాజంపేట టీడీపీలో కొనసాగుతోందన్న విమర్శలున్నాయి.
అయ్యో.. పసుపులేటి బ్రహ్మయ్య..
రాజంపేట తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో వెలుగు వెలిగిన నేత బలిజ సామాజికవర్గానికి చెందిన పసుపులేటి బ్రహ్మయ్య. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తోపాటు చంద్రబాబునాయుడు పాలనలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అపార అనుభవం కలిగిన నేత. 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతారని తెలిసి కూడా, పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకురాకపోతే పసుపులేటి బ్రహ్మయ్య పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అన్ని విధాలుగా నష్టపోయారు. మానసికంగా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మయ్య గురించే పట్టించుకోలేదన్న అంశం బహిరంగ అంశం. ఆయన వర్గీయులు చెట్టుకొకరు పుట్టకొకరు పోయారు. ఆయన తనయులకు రాజకీయంగా చంద్రబాబు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన ఉంది.
రాజకీయ ప్రయోగంలో బత్యాల బలి..
రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో బలిజ సామాజిక వర్గాల్లో పట్టుకల్గిన నేత బత్యాల చెంగల్రాయుడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో బత్యాల చెంగల్రాయుడుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆ పదవి తప్ప మరో పదవి రాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసే నాథుడు కరువైన దుస్థితిలో రైల్వేకోడూరు నుంచి బత్యాలను తీసుకొచ్చి రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయించారు. వైఎస్సార్సీపీ చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బత్యాల రాజంపేట రాజకీయాలకు దూరమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రైల్వేకోడూరుకే బత్యాలను పరిమితం చేశారు.
అధిష్టానంపై సన్నగిల్లుతున్న నమ్మకం..
టీడీపీకి పనిచేసిన సీనియర్లకు, కార్యకర్తలకు అధిష్టానం వైఖరిపై నమ్మకం సన్నగిల్లుతోంది. తమను వాడుకోవడమే కానీ, తమకు చేసేదేమీలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పసుపులేటి బ్రహ్మయ్య, బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాల సుబ్రమణ్యంలు రాజకీయ వ్యవహారంలో సమిధలుగా మారిన తీరుతెన్నులను తమ్ముళ్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. రాజంపేటలో టీడీపీకి బలిజ సామాజికవర్గం అండగా ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ సామాజిక వర్గనేతలకు జరుగుతున్న అన్యాయాన్ని బలిజలు దిగమింగుకోలేకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పార్టీ రాదన్న ఆందోళన, టీడీపీకి వస్తున్న ప్రజావ్యతిరేకతను చూసి తమ్ముళ్లు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇన్చార్జి ఫైనల్పై అధిష్టానం కసరత్తు..
టీడీపీ ఎన్నికల అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గుడ్బై చెప్పడంతో రాజంపేట టీడీపీ వర్గాలు కుదేలయ్యాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదికే టీడీపీకి షాక్ తగిలే సరికి అధిష్టానం ఉలిక్కి పడిందని కొందరు నేతలు అంటున్నారు. ఇన్చార్జి విషయంలో తేల్చాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చేసింది. ఇప్పటికే ఇన్చార్జి రేసులో చమర్తి జగన్మోహనరాజు, మేడా విజయశేఖర్రెడ్డి ఉన్నారు. తాజాగా బత్యాలకే ఇన్చార్జి ఇవ్వాలని, చమర్తి రాజకీయాన్ని వ్యతిరేకిస్తూ తమ్ముళ్లు ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఎవరంతట వారు తమ నేతకే ఇన్చార్జి అని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇన్చార్జి కుర్చీ రెడ్డి సామాజికవర్గానికి అప్పగించాలని టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
యూజ్ అండ్ త్రో పాలిట్రిక్స్
రాజంపేటలో ఇన్చార్జి రగడ
క్యాడర్లో అధిష్టానంపై సన్నగిల్లుతున్న నమ్మకం

బాబు మార్కు రాజకీయానికి.. ఆ ముగ్గురు బలి!

బాబు మార్కు రాజకీయానికి.. ఆ ముగ్గురు బలి!