
టిడ్కో ఇళ్ల సమీపంలో పశువధ కేంద్రం గుర్తింపు
మదనపల్లె రూరల్ : మండలంలోని తట్టివారిపల్లె పంచాయతీ ఎర్రగానిమిట్ట వద్ద టిడ్కో ఇళ్లకు ఉత్తరం వైపున ఉన్న పాత కోళ్లఫారం షెడ్డులో రహస్యంగా పశువులను వధిస్తున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. శానిటోరియం వద్ద ఆవును వధిస్తున్నారనే సమాచారం మేరకు..స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కోళ్లఫారం షెడ్ వద్దకు చేరుకున్నారు. జంతు వధశాలను గుర్తించి సమాచారం ఉన్నతాధికారులకు చేరవేశారు. వారి ఆదేశాలతో తాలూకా పోలీసులు అక్కడకు చేరుకుని వధించేందుకు సిద్ధంగా ఉన్న 6 కోడెదూడలు, 1 దేశవాళీ ఆవు, 4 జెర్సీ ఆవులను గమనించి, వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ లోపు విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు బండి ఆనంద్, భగవాన్, వి.నారదరెడ్డి, విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ నాయకులు షెడ్ వద్దకు చేరుకున్నారు. బక్రీద్ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో...డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ..గోవధ జరగకుండా చూస్తామని, దీనిని అరికట్టేందుకు డివిజన్ పరిధిలో మూడు చెక్పోస్ట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే ఎవ్వరికీ అనుమానం రాకుండా గోవులను రహస్యంగా శానిటోరియం వద్దకు తరలించి, వధిస్తుంటే పోలీసులు ఎందుకు అరికట్టలేకపోయారని ప్రశ్నించారు. జంతు వధశాలలో స్వాధీనం చేసుకున్న గోవులను తీసుకువచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలపాలని బీజేపీ, వీహెచ్పీ, భజరంగదళ్ నాయకులు నిర్ణయించగా, పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకుని పుంగనూరురోడ్డులోని నాగదేవత గోశాల ట్రస్ట్కు పశువులను తరలించారు. ఈ ఘటనపై తాలూకా సీఐ కళా వెంకటరమణ మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు సమీపంలో పశువధ జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించగా కట్టివేసిన 10 పశువులను గుర్తించామన్నారు. పాత కోళ్లఫారం జాకీర్హుస్సేన్కి చెందినదిగా గుర్తించి, సుమోటోగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో బీజేపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గోహంతకులను అరెస్ట్ చేయాలని ధర్నాకు పూనుకోవడంతో పోలీసులు బండి ఆనంద్, వి.నారదరెడ్డి, భగవాన్, మోహన్ తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆవులు, కోడెదూడలు గోశాలకు తరలింపు

టిడ్కో ఇళ్ల సమీపంలో పశువధ కేంద్రం గుర్తింపు