
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : క్రమశిక్షణతో ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో టెన్త్, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన పద్మశాలీయ విద్యార్థులకు నగదు, ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్రమణ్యం మాట్లాడుతూ కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. ఏ పనినైనా ఇష్టపడి చేయాలని సూచించారు. తమ బిడ్డలు ఉన్నత స్థానాల్లో నిలబడితే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవన్నారు. పద్మశాలీయ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అవ్వారు వెంకటసుబ్బయ్య, అధ్యక్షుడు అవ్వారు సుబ్బరాయుడు మాట్లాడుతూ పద్మశాలీయ విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంపొందించి భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతో గత 19 సంవత్సరాలుగా నగదు ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎంసీ వెంకటసుబ్బయ్య, రాటాల గోపి, బీవీ సుబ్బారాయుడు, పుత్తా శివరామయ్య, బోడగల వెంకటరామయ్య, గొట్టుముక్కల వెంకటరమణయ్య, సోమా శంకర్, అవ్వారు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రమణ్యం