
చోరీ కేసుల్లో దొంగ అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగను చిన్న చౌక్ పోలీసులు ఆదివారం కడప ఎయిర్పోర్ట్ వద్ద అరెస్టు చేసినట్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కడప మోచంపేటలోని చిలకల బావికి చెందిన షేక్ అక్బర్ ఆలీ ఎలక్ట్రిషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్, జూదం తదితర వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నాడు. కడప నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై దాదాపు 20 కేసులకు పైగానే ఉన్నట్లు తెలిపారు. దొంగతనం కేసులో జైలుకు వెళ్లి తిరిగి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుతో గోవా, ఢిల్లీ ప్రాంతాల్లో వెళ్లి తలదాచుకుంటూ తిరిగి మళ్లీ కడపకు వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఎన్జీవో కాలనీ, మత్యుంజయకుంట, అక్కాయపల్లెలో చోరీలకు పాల్పడి దొరికిన బంగారు నగ లు తీసుకొని పారిపోతున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి సిబ్బందితో నిందితుడు అక్బర్ ఆలీని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 40.160 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
40 గ్రాముల బంగారు నగలు స్వాధీనం