
ప్రాణం తీసిన ఈత సరదా
జమ్మలమడుగు : సరదాగా ఈత కొట్టేందుకు పెన్నా నదిలోని నీటిలోకి దిగిన తండ్రీ కొడుకులు దుర్మరణం చెందిన సంఘటన శనివారం జమ్మలమడుగు మండలంలో జరిగింది. వివరాలు ఇలా..తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుక చెందిన మనోహర్ (38), అతని కుమారుడు డియోల్ (17) పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన సోదరి ప్రమీలా రాణి ఇంటికి వచ్చారు. శనివారం పర్యాటక కేంద్రమైన గండికోటను సందర్శించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ముద్దనూరు– జమ్మలమడుగు రహదారిలోని పెన్నానదిలో నీటిని చూసి ఈత కొట్టేందుకు దిగారు. బ్రిడ్జి సమీపంలో గుంత ఉన్న విషయం వారికి తెలియదు. తొలుత మనోహర్ నీళ్లలోకి దిగగానే అక్కడ పెద్ద గుంత ఉండటంతో అందులో పడిపోయాడు. గమనించిన కుమారుడు డియోల్ తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించి అతను కూడా అదే గుంతలో కూరుకుపోయి గల్లంతయ్యారు. తమ కళ్లెదుటే తండ్రీ కొడుకులు నీళ్లలో గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో తండ్రి, కుమారుడి మృతదేహాలను బయటికి తీశారు. ఇద్దరి మృతదేహాలను చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ లింగప్ప తెలిపారు.
పెన్నానదిలో దిగి తండ్రీ తనయుల దుర్మరణం

ప్రాణం తీసిన ఈత సరదా