
పంట కాలువ పూడ్చి.. ఆపై ఆక్రమించి!
సాక్షి టాస్క్ఫోర్స్ : చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో టీడీపీ వర్గీయులు రైతుల పొలాలకు నీటిని అందించాల్సిన పంట కాలువను పూడ్చి తమ పొలంలో కలిపేసుకున్నారు. ఈ ఆక్రమణను గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అద్దాలమర్రి గ్రామంలోని ఆయకట్టు భూములకు పాపాఘ్ని నది నుంచి పెద్ద కాలువ ద్వారా నీరు వస్తుండేది. ఈ కాలువ కుమార్లకాల్వ వద్ద నుంచి ఉండేది. అయితే అద్దాలమర్రికి చెందిన టీడీపీ వర్గీయులు కొందరు కాలువను పూడ్చి తమ పొలంలో కలుపుకుంటే విస్తీర్ణం పెరుగుతుంది.. పైగా తమ ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఎవరు అడ్డు వచ్చినా తమకేమీ భయం లేదని భావించి ఏకంగా జేసీబీని రప్పించుకొని కాలువను పూడ్చేశారు. కొందరు రైతులు వెళ్లి ఇదేమి న్యాయం.. పూర్వ కాలం నుంచి గ్రామంలోని రైతులందరికీ సాగునీరు అందించే కాలువ ఎలా పూడుస్తారని నిలదీశారు. దీంతో తమకు రెవెన్యూ అధికారులు చెప్పడంతోనే పూడ్చేశాం. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో పోండి అంటూ ఎదురు దాడికి దిగుతున్నారని రైతులు వాపోయారు. ఈ విషయంపై పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు.
చక్రాయపేట మండలంలో
టీడీపీ వర్గీయుల ఆక్రమణ పర్వం