
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగర శివార్లలోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, రోడ్డు ప్రమాదాల మూలంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు భద్రత కమిటీలోని ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేసి ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యాలయం సిబ్బందితో మాట్లాడి మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.