
బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో చేరండి
వేంపల్లె : ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో బ్రాహ్మణులందరూ సభ్యులుగా చేరాలని బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పీవీఎస్వీ.ప్రసాదరావు ఓ ప్రకటనలో కోరారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ క్రెడిట్ సొసైటీలో సభ్యులుగా చేరి ముగ్గురితో గ్రూపు ఉంటే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరుచేస్తారన్నారు. వ్యక్తిగత రుణాలు తీసుకునే అవకాశం ఉందని, వ్యాపారం కోసం మొదట్లో రూ.2 లక్షలు రుణం పొందవచ్చునన్నారు. 18–60 ఏళ్ల లోపు బ్రాహ్మణులందరూ సభ్యత్వం పొందవచ్చునన్నారు.ఈ అవకాశాన్ని అర్హులైన బ్రాహ్మణులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డీమ్డ్ యూనివర్శిటీగా ఆదిశంకర
నెల్లూరు (టౌన్) : ఆదిశంకర గ్రూపు ఆప్ ఇన్స్టిట్యూట్కు డీమ్డ్ యూనివర్శిటీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు లభించిందని ఆ విద్యా సంస్థల గ్రూపు చైర్మన్ వంకిపెంచలయ్య తెలిపారు. స్థానిక దర్గామిట్టలోని మినర్వా గ్రాండ్లో డీమ్డ్ యూనివర్శిటీ లోగోను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ జోన్లో డీమ్డ్ యూనివర్శిటీగా గుర్తింపు పొందింది కేవలం ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల మాత్రమేనని చెప్పారు. 2001లో కేవలం 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఇంజినీరింగ్ కళాశాల నేడు 8వేల మంది విద్యార్థులతో ఉందన్నారు. కోవూరు సమీపంలోని రామన్నపాలెం వద్ద కొత్తగా ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిందు మధ్వాచార్య, ప్రొఫెసర్లు వేణుమాధవ్, ధనుంజయ, ఏఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
పది మూల్యాంకనంలో నిర్లక్ష్యం
రాయచోటి జగదాంబసెంటర్ : పదో తరగతి ఫలితాల మూల్యాంకనంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర చక్రధర్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్దాస్ అన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ డీఈఓ సుబ్రహ్మణ్యంను శుక్రవారం వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యారని, మూల్యాంకనంలో లోపాలతో అనుత్తీర్ణత సాధించారని తెలిపారు. ప్రతి విద్యార్థి తమ మార్కుల జాబితాపై అనుమానంతో ఉన్నారని, రీవాల్యుయేషన్కు ఎలాంటి ఫీజు లేకుండా అవకాశం కల్పించాలన్నారు. తుది ఫలితాలు వచ్చే వరకూ పది మార్కుల ఆధారంగా జరిగే అడ్మిషన్లను నిలిపివేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర్రెడ్డి, మణికంఠారెడ్డి, యూసఫ్ఖాన్, లోకనాథం, శివకుమార్, మొఘల్ ఫైజాన్బేగ్, సయ్యద్ ఫైజాన్, జగదీష్, షేక్ ఒబైజ్, షేక్ మహమ్మద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
13న వెలిగల్లు ఉద్యానవనంలో యోగాంధ్ర
గాలివీడు : ఈ నెల 13న వెలిగల్లు ఉద్యానవనంలో యోగాంధ్ర కార్యక్రమం ని ర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి హామీ పిడీ వెంకటరత్నం, టూరిజం అధికారి నాగ భూషణం తెలిపారు. మండల ఎంపీడీఓ జవహర్బాబుతో కలసి గాలివీడు మండలంలోని వెలిగల్లు ఉద్యానవన స్థలాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ యోగా ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించగలరని అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ హరిబాబు,తదితరులు పాల్గొన్నారు.
మహల్లో బ్యానర్లకు చిచ్చు
కలికిరి : మండలంలోని గుండ్లూరులో వెలసిన మూలస్థానమ్మ తిరునాల ప్రారంభం కానున్న నేపథ్యంలో అద్దవారిపల్లి పంచాయతీ పరిధిలోని మహల్ యర్రదొడ్డిపల్లి వైఎస్సార్సీపీ యువత బ్యానర్ ఏర్పాటుచేశారు. ఇది ఓర్వలేని టీడీపీ నాయకుడైన సతీష్రెడ్డి అనుచరుడు హరీష్ శుక్రవారం మధ్యాహ్యం 1.50గంటల సమయంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోలు బ్యానర్పై పోసి నిప్పంటించాడు. స్థానిక సీసీ కెమరాల్లో రికార్డవడంతో వైఎస్సార్సీపీ నాయకులు ప్రదీప్కుమార్రెడ్డి, రిజ్వాన్, యువత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు ఏర్పాటు చేసిన గుండ్లూరు మూలస్థానమ్మ జాతర బ్యానర్పై పెట్రోలు నిప్పటించడం హేయమైన చర్య అని పలువురు అసహనం వ్యక్తం చేశారు.

బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో చేరండి

బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో చేరండి