
సమాజ సేవే ముఖ్యం
కమలాపురం : తమ పరిశ్రమ కేవలం వ్యాపారం మాత్రమే చేయడంలేదని, దాంతోపాటు సమాజ సేవలో ముందుందని భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్(బీసీసీపీఎల్) సీఎంఓ సాయి రమేష్ తెలిపారు. స్థానిక క్రాస్ రోడ్డు వద్దగల ఆర్సీఎం ఆసుపత్రి భవనంలో పలువురికి శిక్షణ సర్టిఫికెట్లు శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీసీపీఎల్ ఆర్థిక సహకారంతో సంభవ్ ఫౌండేషన్ పర్యవేక్షణలో వివిధ ప్రాంతాల పేదలకు ఆర్టీసీ ద్వారా ఉచితంగా 32 రోజుల శిక్షణ ఇచ్చి హెవీ లైసెన్స్ ఇప్పించారన్నారు. ఇప్పటికే పలు చోట బస్ షెల్టర్లు, నీటి శుద్ధి కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, డయాలసిస్, హిమో డయాలసిస్ సెంటర్లు, మరుగుదొడ్లు ఏర్పాటుచేశామన్నారు. దత్తత గ్రామాల పాఠశాలల్లో ఫర్నిచర్తోపాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు మెరుగుపరిచామన్నారు. ప్రస్తుతం డ్రైవర్లకు శిక్షణ నిచ్చి హెవీ లైసెన్స్ ఇప్పించడంతోపాటు ఆర్టీసీలోనే ఉపాధి కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ చీఫ్ మేనేజర్లు గోపాల్రెడ్డి, పేర్ల భార్గవ్ రెడ్డి, సీఎస్ఆర్ చీఫ్ నీతేశ్వర్, ఫౌండేషన్ జీఎం గిరిధర్ రెడ్డి, ఆర్టీసీ ట్రైనర్ జబ్బార్ వలి, సిబ్బంది పాల్గొన్నారు.
భారతి సిమెంట్ సీఎంఓ సాయి రమేష్