
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
ఓబులవారిపల్లె : నగలు అమ్మి వైద్యం చేయించినా నయం కాకపోవడంతో ఆ కుటుంబం అల్లాడిపోతోంది. లక్షల రూపాయలు చికిత్సకు ఇంకా కావాలని చెప్పడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. మండలంలోని చిన్నఓరంపాడు దళితవాడ గ్రామానికి చెందిన కోటపాడి ఉమామహేశ్వరరావు పెగలూరు మండల మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉమా మహేశ్వరరావుకు భార్య ఉమాకుమారి, ఇద్దరు కుమారులు జతిన్కుమార్, గణపతి ఉన్నారు. వీరు రైల్వేకోడూరులోని అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు. ఉమా కుమారి కుట్టు మిషన్ కుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు తిరుపతి ఆసుపత్రిలో చేర్పించారు. శరీరంలోని అవయవాలు పనిచేయడం లేదని.. చెప్పడంతో చికిత్స కోసం దాదాపు పది లక్షల రూపాయలు బంగారు అమ్మి, అప్పు చేసి చెల్లించారు. ఇంకా లక్షల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. భర్తకు వచ్చిన జీతాలు పోగా ఆస్తులు అమ్మి డబ్బు ఆసుపత్రికి కట్టినా ఇంకా నయం కాకపోవడంతో మరింత ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. దాతలు ఆర్థిక సహకారం అందించి తమ తండ్రి ప్రాణాలు కాపాడాలని కుమారులు కోరుకుంటున్నారు.