
రైలు నుంచి జారిపడి వృద్ధుడి మృతి
అనంతపురం సిటీ : అనంతపురం రైల్వే స్టేషన్లో కదిలే రైలు ఎక్కబోయి.. ప్రమాదవశాత్తూ అదుపు తప్పి పడిపోయిన దూదేకుల సంజీవరాయుడు(60) మరణించినట్లు జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు.. సంజీవరాయుడుకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. ఎర్రగుంట్లలోని చిన్న కొడుకు వద్ద ఉంటున్న రాయుడు హోటల్లో పనిచేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు. తాగుడు అలవాటు ఉన్న రాయుడు.. యథావిధిగా హోటల్లో పని ముగించుకొని.. మందుకొట్టి గురువారం రాత్రికి వెళ్లాడు. దీంతో చిన్న కొడుకు తిట్టడంతో మనస్తాపానికి గురైన రాయుడు రాత్రికి ఇంటి నుంచి వచ్చేసి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లోనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయమే మచిలీపట్నం–ధర్మవరం రైలెక్కి వచ్చేశాడు. రైలు అనంతపురం చేరుకోగానే నీళ్ల కోసం దిగిన రాయుడు.. రైలు కదులుతుండడం చూసి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సర్వజనాస్పత్రి మార్చురీకి తరలించారు.