
మద్యం మత్తులో తోసేయడంతో వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : మద్యం మత్తులో ఒక వ్యక్తి మరో వ్యక్తిని తోసేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామం రాజీవ్నగర్లో జరిగింది. పట్టణ ఎస్ఐ హేమలత ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెంచెరువు గ్రామంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన చెండ్రాయుడు (30) అదే కాలనీకి చెందిన నాగేంద్ర యాదవ్ కలిసి కాలనీలోని పెద్దమ్మ గుడి సమీపంలో మంగళవారం రాత్రి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో చెండ్రాయుడును నరేంద్ర యాదవ్ తోసేయడంతో పక్కన ఉన్న రాయి తలకు తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన అతనికి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు బేల్దార్ పనులు చేసుకొని జీవించేవాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.