
రోడ్డు ప్రమాదంలో జార్ఖండ్ వాసి..
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జార్ఖండ్ వాసి మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. వలసపల్లె పంచాయతీ మొలకలదిన్నె వద్ద బీడీఎస్ ఫంక్షన్ హాల్లో జార్ఖండ్కు చెందిన సర్ఫరాజ్ (27) పనిచేస్తున్నాడు. అతనికి ప్రతిరోజు సాయంత్రం జిమ్కు వెళ్లే అలవాటు ఉండటంతో, బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో మదనపల్లెలోని జిమ్ సెంటర్కు బయలుదేరాడు. మార్గమధ్యంలోని డ్రైవర్స్ కాలనీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై అధిక రక్తస్రావమై తీవ్ర గాయాల పాలయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన తాలూకా పోలీసులు వాహనం అదుపుతప్పి కిందపడి గాయాలపాలై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొందా..? లేక వాహనం అదుపుతప్పి కిందపడి మృతి చెందాడా అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.