
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం ది బీసీ ప్రజాచైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ విద్యార్థులకు 15వ ప్రజ్ఞా పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అంతరాలను తొలగించడానికి విద్య ఒక్కటే సాధనమన్నారు. విద్యార్థులకు మంచి ఆలోచనా దృక్పథం అవరసరమన్నారు. వెనుకబాటు తనాన్ని అధిగమించాలంటే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి తొగర్ల చిరంజీవులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఏది ఇష్టమో గుర్తించి ఆ వైపుగా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలని, దుర్వినియోగం చేయరాదన్నారు. ప్రస్తుత సమాజంలో వివిధ రకాల నైపుణ్యాలు అవసరమని, జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఏరోజుకారోజు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సమాఖ్య అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిభ గల బీసీ విద్యార్థులను చదవులో ప్రోత్సహించడానికి తాము 15 ఏళ్లుగా ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నామన్నారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్, జేఈఈ మెయిన్స్లో రాణించిన వివిధ కులాల బీసీ విద్యార్థులు 76 మందికి రూ.2.50 లక్షల నగదు ప్రోత్సాహక బహుమతులను అందించారు. కార్యక్రమంలో సమాఖ్య ఉపాధ్యక్షుడు జీసీ పుల్లయ్య, కొత్తపల్లె శ్రీను, ప్రధాన కార్యదర్శి దేవేంద్రుడు, కార్యదర్శి భాస్కరరావు, కోశాధికారి సంటెయ్య పాల్గొన్నారు.
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్