మాతృభూమి కన్నతల్లితో సమానం.. భూమాత ఒడిలో ప్రజలందరూ ఎళ్లవేళలా క్షేమంగా ఉండాలని దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్నారు భారత సైనికులు. భరతమాత సేవకు జీవితం అంకితం చేస్తున్నారు. బంధుత్వాలు, కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ దేశరక్షణే లక్ష్యంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న సైనికులంటే మనదేశంలో ప్రత్యేక గౌరవం ఉంది. ఇప్పుడు అటువంటి సైనికుల పట్ల మనకు ఉన్న గౌరవాన్ని సైనికుల కుటుంబాలకు మేమున్నామంటూ తమవంతు చేయూతనిచ్చే అవకాశం వచ్చింది.. డిసెంబర్ 7వ తేదీని ప్లాగ్ డే పేరుతో సాయుధ దళాల దినోత్సవంగా నిర్వహించుకుంటాం.
కడప స్పోర్ట్స్: దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు, యుద్ధసమయంలో అవయవాలను కోల్పోయిన వీరసైనికులకు బాసటగా నిలిచేందుకు సాయుధదళాల వారోత్సవాలు ఏర్పాటయ్యాయి. 1949 డిసెంబర్ 7న త్రివిధ సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహించడం ప్రారంభించారు. అయితే 1993లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ పేరుతో నిధిని ఏర్పాటు చేశారు. దేశ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అప్పటి నుంచి ప్రతి యేటా డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు సాయుధ దళాల వారోత్సవాలు నిర్వహించి 7వ తేదీన ఫ్లాగ్డేగా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ రంగాలకు చెందిన సైనికులు, వారి కుటుంబీకులు, వితంతువులకు చేయూతనిచ్చేందుకు విరాళాలను సేకరిస్తారు. విరాళాల ద్వారా వచ్చిన సొమ్మును అధికారుల ద్వారా వైకల్యం పొందిన మాజీ సైనికులు/వారి కుటుంబ సభ్యులు, వితంతువులకు అందజేస్తారు.
●దేశసైన్యంలో జిల్లాలో ప్రాతినిధ్యం
దేశసైన్యంలో వైఎస్ఆర్ జిల్లాకు ప్రత్యేకస్థానం ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో సైన్యంలో జిల్లా వాసులు పనిచేయడం మన జిల్లాకు దక్కిన గౌరవం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా త్రివిధ దళాల్లో 5014 మంది మాజీ సైనికులు పనిచేసి ఉన్నారు. వీరిలో ఆర్మీలో 4636, ఎయిర్ఫోర్స్లో 297 మంది, నేవీలో 81 మంది ఉన్నారు. వీరితో పాటు సైన్యంలో కుటుంబసభ్యులను కోల్పోయిన వితంతువులు ఆర్మీలో 1092 మంది ఉన్నారు. అయితే వీరందరికి ప్రభుత్వ పరంగా పలు ప్రయోజనాలు లభిస్తున్నప్పటికీ వారి సేవలకు ఎంతచేసినా తక్కువే అన్న భావనతో పౌరులు స్పందించి తోచిన సాయం చేసి సైనికులకు వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించే యత్నమిది.
నేడు సాయుధ దళాల
పతాక దినోత్సవం
సైనికుల త్యాగనిరతిని స్మరించుకుందాం..
దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వీరసైనికులను, వారి కుటుంబసభ్యుల త్యాగనిరతిని స్మరించుకునేందుకు త్రివిధ సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నాం. ప్రజలు విరివిగా విరాళాలు ఇచ్చి భారత సైన్యంలో మాతృభూమికి విశేష సేవలు అందించిన వీరజవాన్ల కుటుంబాలకు బాసటగా నిలవాలి.
– డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా కలెక్టర్
సెల్యూట్.. సైనికా!
సెల్యూట్.. సైనికా!