‘స్పందన’ పేరు మార్పు | - | Sakshi
Sakshi News home page

‘స్పందన’ పేరు మార్పు

Published Sat, Jun 15 2024 11:44 PM | Last Updated on Sat, Jun 15 2024 11:44 PM

‘స్పం

కడప సెవెన్‌రోడ్స్‌: ప్రతి సోమవారం కలెక్టరేట్‌తోపాటు ఇతర కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమం పేరును మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పందన పేరుకు బదులు ‘పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టమ్‌’గా మార్పు చేశారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మీ కోసం అనే పేరు పెట్టారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దాని పేరు స్పందనగా మార్పు చేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో గ్రీవెన్‌సెల్‌గా మార్పు చేశారు.

యధావిధిగా ఖైదీల ములాఖత్‌

కడప అర్బన్‌: రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రస్తుత ఉత్తర్వుల మేరకు ఎండతీవ్రత, వడగాల్పులు తగ్గుముఖం పట్టిన కారణంగా కడప కేంద్ర కారాగారంలోని నిందితులను, ఖైదీలకు ఇచ్చే ‘ములాఖత్‌’ (ఇంటర్వ్యూ)లను మునుపటి లాగానే ఉండనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని రోజుల్లో నిర్వహించనున్నట్లు కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్‌ ఐఎన్‌హెచ్‌ ప్రకాష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

జెడ్పీ ఇన్‌చార్జి

చైర్‌పర్సన్‌గా శారద

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జి చైర్‌ పర్సన్‌గా శారద నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి ఆమెకు అందజేశారు.శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రొద్దుటూరు జెడ్పీటీసీగా ఆమె ఎన్నికయ్యారు. ఇప్పటివరకు జెడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌గా వ్యవహారిస్తూ వచ్చారు. జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట శాసనసభ్యునిగా ఎన్నికై న విషయం తెలిసిందే. దీంతో జెడ్పీ చైర్మన్‌ పదవికి ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో శారదను ఇన్‌చార్జి జెడ్పీ చైర్‌ పర్సన్‌గా నియమించారు. ఈ సందర్బంగా జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి, ఇతర సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆసుపత్రుల్లో సౌకర్యాల

కల్పనకు కృషి

కడప అర్బన్‌: కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో నిశ్చిత్‌ ప్లస్‌ టీబీ షేర్‌ ఇండియా ప్రతినిధి డాక్టర్‌ నీరద శనివారం పర్యటించారు. కాన్పుల విభాగం (లేబర్‌ వార్డు)తో పాటు, ఐసీయూ, మెడికల్‌, సర్జికల్‌, ఇతర విభాగాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ తరపున ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం వైద్యులతో సమావేశమయ్యారు. ఆమె వెంట ఆర్‌ఎంఓ డాక్టర్‌ వై. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఐటీఐలో ప్రవేశాలకు

19 నుంచి కౌన్సెలింగ్‌

కడప ఎడ్యుకేషన్‌: ఏడాది, రెండేళ్ల పారిశ్రామిక శిక్షణ కోర్సుల్లో (ఐటీఐ) ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. కడప రిమ్స్‌ వద్ద పుష్పగిరి ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్‌లో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల జిల్లా కన్వీనర్‌, మైనార్టీ ఐటీఐ ప్రధానాచార్యులు జ్ఞానకుమార్‌ తెలిపారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు 10 జీపీఏ నుంచి 7.4 జీపీఏ వరకు, 20వ తేదీ 7.3 జీపీఏ నుంచి 5.7 జీపీఏ వరకు, 21వ తేదీ ఉదయం 9 గంటలకు 5.6 జీపీఏ నుంచి 3 జీపీఏ వచ్చిన వారికి కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. మిగిలిన అన్ని సీట్లకు 22వ తేదీన జనరల్‌ పూల్‌ పద్దతిలో 10 జీపీఏ నుంచి 3 జీపీఏ వరకు సీటు పొందని విద్యార్థులకు మరోమారు కౌన్సెలింగ్‌ నిర్వహించి సీటు కేటాయించనున్నట్లు చెప్పారు.ఇతర వివరాలకు 9989290960, 9502556741 నంబర్లలో కార్యాలయ పనివేళ్లలో సంప్రదించాలని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘స్పందన’ పేరు మార్పు 1
1/1

‘స్పందన’ పేరు మార్పు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement