
మాదిగలు విద్యతోపాటు ఆర్థికంగా ఎదగాలి
బీబీనగర్: సామాజిక న్యాయం జరగాలంటే మాదిగలు చదువుతో పాటు ఆర్థికంగా ఎదగాలని ప్రొఫెసర్ కాశీం పేర్కొన్నారు. ఆదివారం బీబీనగర్లో నిర్వహించిన జ్ఞానచైతన్య సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదిగ జాతిలో మార్పు రావాలంటే ఉన్నత చదువులు చదవాలని తద్వారా ఆర్థికంగా బలపడుతారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మంద కృష్ణమాదిగ అలుపెరగని ఉద్యమం చేశారన్నారు. రైల్వే రిటైర్డ్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ భరత్ భూషణ్, ప్రజాకవి ఏపూరి సోమన్న మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అక్షరజ్ఞానం కలిగిఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణించగలుగుతామన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు నాగారం అంజయ్య, కుమార్, నరసింహ, పొట్ట వెంకటేశ్వర్లు, నగేష్, కిషన్, రామచంద్రయ్య, జహంగీర్, సుదర్శన్, మహేష్, పొట్ట నవీన్ పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి ఎంపిక పోటీలు
భువనగిరి: క్రీడా పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశానికి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24,25 తేదీల్లో విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 24న బాలికలకు, 25న బాలురకు జిల్లా కేంద్రంలో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8074487020ను సంప్రదించాలని కోరారు.
పీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఆలయ ఈఓ వెంకట్రావ్కు సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. భక్తులు యాదగిరికొండపైన వ్రతపూజలు నిర్వహించేందుకు ప్రత్యేక భవనం నిర్మించాలని, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలని, పాత హైస్కూల్ ఖాళీ స్థలంలో భక్తుల వసతికోసం భవనాలు నిర్మించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతన చట్టం అమలు చేయాలన్నారు. చింతపండు చోరీ కేసులో బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు ఉన్నారు.

మాదిగలు విద్యతోపాటు ఆర్థికంగా ఎదగాలి