
రుణ లక్ష్యం రూ.6,660.15కోట్లు
సాక్షి, యాదాద్రి : 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ హనుమంతరావు బుధవారం విడుదల చేశారు. కలెక్టరేట్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో రూ.6,660.15 కోట్ల అంచనాతో రుణ ప్రణాళిక రూపొందించారు. రూ.5,334.80 కోట్లు (80.10%) ప్రాధాన్యత రంగాలకు కేటాయించగా, రూ.1,325.35 కోట్లు ఇతర రంగాలకు కేటాయించారు. వ్యవసాయ రంగానికి రూ.4,284.41కోట్లు (మొత్తం ప్రణాళికలో 64.31%), ఇందులో పంట రుణాలు: రూ. 2,391.28 కోట్లు, వ్యవసాయ టర్మ్ లోన్లు రూ. 1,599.67 కోట్లు ఉన్నాయి. సూక్ష్మ, చిన్న – మధ్య తరహా పరిశ్రమలకు రూ.902.67 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 147.72 కోట్లు కేటాయించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున బ్యాంకు అధికారులు రైతులకు సకాలంలో రుణాలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, బీసీ వెల్ఫేర్ అధికారి యాదయ్య, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం రవీందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివరామకృష్ణ, ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీశ్రావ్య, నాబార్డ్ ఏజీఎం వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.