
సీఎం సభకు భారీ ఏర్పాట్లు
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
తుర్కపల్లి, బీబీనగర్: సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. గురువారం సభా వేదికను ఆయన పరిశీలించి మాట్లాడారు. సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రదేశంతో పాటు సభా వేదిక చుట్టూ మెటల్ డిటెక్టర్లను అమర్చినట్లు తెలిపారు. అదేవిధంగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును కూడా సీపీ సుధీర్బాబు పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీసీపీ అక్షాంశ్యాదవ్ ఉన్నారు.
యాదగిరిగుట్ట: తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా రూ.1,500కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు, రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు సీఎం అందజేయనున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా సభా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
భారీ వేదిక..
వర్చువల్గా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 20 ఎకరాల్లో బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని తీర్చిదిద్దారు. సీఎంతో పాటు మంత్రులు, ఇతర ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సుమారు 100 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. వర్షం పడితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు. సభ సాయంత్రం జరగనున్న నేపథ్యంలో విద్యుత్ దీపాలు సైతం బిగిస్తున్నారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో పాటు మీడియాకు, వివిధ శాఖ అధికారులు, ఆలేరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 21వేల మంది లబ్ధిదారులు కూర్చునేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సీఎం చేతుల మీదుగా 12మంది లబ్ధిదారులు ప్రొసీడింగ్లు, చెక్కులు అందుకోనున్నారు.
ప్రత్యేక బందోబస్తు..
రాచకొండ సీపీ సుధీర్బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సభ ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఐదుగురు డీసీపీలు, 12మంది అదనపు డీసీపీ, 20మంది ఏసీపీలు, 50మంది సీఐలు, 150 మంది ఎస్ఐలు సివిల్, ట్రాఫిక్, సీఆర్పీఎఫ్, ఎస్బీ, ఇంటలిజెన్స్ పోలీసులతో పాటు 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తిర్మలాపూర్, వీరారెడ్డిపల్లి గ్రామాల సమీపంలో సుమారు 30 ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు చోట్ల పార్కింగ్ కోసం స్థలాన్ని సిద్ధం చేశారు. మొత్తం 4 విభాగాలుగా పార్కింగ్ స్థలాన్ని విభజించి, ట్రాఫిక్ పోలీసులు సూచించిన స్థలంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
సభా స్థలంలోనే శుంకుస్థాపన..
తుర్కపల్లి: గంధమల్ల రిజర్వాయర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మోటకొండూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు, రోడ్లు, దాతర్పల్లిలో గోదామలు, కొలనుపాక, కాల్వపల్లి హైలెవల్ బ్రిడ్జిలకు సభా స్థలంలోనే సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
సభ ఏర్పాట్లపై సమీక్ష..
సభ స్థలాన్ని అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డితో కలిసి కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేశ్యానాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ 100 మంది కూర్చునేలా వేదిక ఏర్పాటు
ఫ 21 వేల మంది లబ్ధిదారుల కోసం ప్రత్యేక గ్యాలరీ
ఫ 1500 మంది పోలీసులతో
భారీ బందోబస్తు

సీఎం సభకు భారీ ఏర్పాట్లు