అటానమస్‌కే.. ఆదరణ | - | Sakshi
Sakshi News home page

అటానమస్‌కే.. ఆదరణ

Jun 6 2025 12:54 AM | Updated on Jun 6 2025 7:36 AM

అటానమస్‌కే.. ఆదరణ

అటానమస్‌కే.. ఆదరణ

కోదాడ: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో అందక ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సగం కళాశాలలు మూతపడగా.. వారం రోజుల క్రితం దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ ఇన్‌ తెలంగాణ) ద్వారా డిగ్రీ కళాశాలలకు జరిగిన మొదటి విడత విద్యార్థుల కేటాయింపు చూసిన తర్వాత ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో కూడా సగానికి పైగా మూతపడటం ఖాయమని పలువురు డిగ్రీ కళాశాలల నిర్వాహకులు అంటున్నారు. అటానమస్‌(స్వయం ప్రతిపత్తి) ఉన్న కళాశాలల్లో మాత్రమే విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపుతుండగా.. అటానమస్‌ లేని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి కనబర్చడం లేదు.

పదిశాతం కూడా నిండలేదు..

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా.. వీటిలో మూడు కళాశాలలకు మాత్రమే స్వయం ప్రతిపత్తి(అటానమస్‌) హోదా ఉంది. దోస్త్‌ మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 2,230 మంది విద్యార్థులు మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఆయా కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లలో ఇవి కేవలం 9.2 శాతం మాత్రమే. ఇక స్వయం పత్రిపత్తి ఉన్న నల్లగొండలోని నాగార్జున(ఎన్జీ) ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, కోదాడలోని కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలల్లో 1,271 మంది విద్యార్థులు చేరారు. స్వయం ప్రతిపత్తి లేని 8 ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 132 మంది మాత్రమే చేరారు. మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కోదాడలో మిగిలింది ఒక్కటే..

కోదాడలో గతంలో ఒక ప్రభుత్వ, 5 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలుండేవి. కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు రావాలంటే మంత్రుల స్థాయి పైరవీలు కావాల్సి వచ్చేది. గత విద్యాసంవత్సరం నుంచి ఈ కళాశాల స్వయం ప్రతిపత్తి పొందడంతో ప్రస్తుతం దోస్త్‌ మొదటి విడతలో 64 మంది విద్యార్థులు చేరారు. రెండు, మూడు విడతల్లో మరికొంత మంది విద్యార్థులు ఇక్కడ చేరుతారని అధ్యాపకులు అంటున్నారు. ఇక నాలుగు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు ఈ విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం అడ్మిషన్లు తీసుకోలేదు. గతంలో మాదిరిగా ఒక్క కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మాత్రమే కోదాడలో మిగిలే అవకాశం ఉందని పలువురు విద్యావేత్తలు అంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో దోస్త్‌ మొదటి విడత అడ్మిషన్ల తీరు ఇలా..

ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలు 03

చేరిన విద్యార్థులు 1272

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 08

చేరిన విద్యార్థులు 132

ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు 50

చేరిన విద్యార్థులు 826

ఫ ఉమ్మడి జిల్లాలో డీలా పడ్డ

ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు

ఫ ‘దోస్త్‌’ మొదటి విడతలో 9.2 శాతం మాత్రమే అడ్మిషన్లు

ఫ మూడు ప్రభుత్వ, ఏడు ప్రైవేట్‌

కళాశాలల్లో సున్నా అడ్మిషన్లు

ఫ 21 కళాశాలల్లో 10మంది లోపే..

నానాటికీ తీసికట్టు

ముఖ్యంగా ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో గతంలో 100కు పైగా ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలుండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 50కు చేరింది. ఈ కళాశాలలన్నింటిలో కలిపి దోస్త్‌ మొదటి విడతలో కేవలం 826 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. 7 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సున్నా అడ్మిషన్లు ఉండగా.. 16 కళాశాలల్లో 10లోపు విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య కన్నా అధ్యాపకుల సంఖ్యే ఎక్కువగా ఉంది. కళాశాలల్లో చేరిన 10మంది విద్యార్థుల్లో ఒక్కో గ్రూప్‌నకు ఇద్దరు ముగ్గురు మాత్రమే చేరారు. వీరితో మూడు సంవత్సరాలు తరగతులు ఎలా నిర్వహించాలో అర్థం కావడం లేదని, రెండో విడతలో చేరిన విద్యార్థులను బట్టి కళాశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ప్రైవేట్‌ కళాశాలల యజమానులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement