
పక్షం రోజుల్లోనే దంపతుల మృతి
చౌటుప్పల్ రూరల్: పక్షం రోజుల్లోనే ఇద్దరు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ సంఘటన సోమవారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన గోశిక భాస్కర్(42)కు ఇదే గ్రామానికి చెందిన పాలాది నవ్యతో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు సుభాష్(8), మహాలక్ష్మి(6) ఉన్నారు. భాస్కర్ ఇంటి వద్దే చేనేత కార్మికుడిగా పని చేస్తుండగా నవ్య భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. కరోనా తర్వాత చేనేత పని కుంటుపడడంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఈనెల 13న నవ్య చేనేత రంగుల్లో వాడే రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నవ్య సోదరుడు పాలాది రాఘవేంద్ర తన సోదరి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి తోడు భార్య చనిపోవడానికి భర్తే కారణమని భార్య మేనమామ మిగతా బంధవులు పదేపదే అనడంతో భాస్కర్ మనోవేదనకు గురయ్యాడు. మరోవైపు భార్య సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి భాస్కర్పై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో భాస్కర్ ఆదివారం అర్ధరాత్రి చేనేత రంగుల్లో కలిపే రసాయనాన్ని తాగి నిద్రపోయాడు. సోమవారం ఉదయమై భాస్కర్ నిద్ర లేవకపోవడంతో తల్లి నిద్ర లేపగా అప్పటికే భాస్కర్ మృతి చెంది ఉన్నాడు. భాస్కర్ను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్న పాలాది రాఘవేంద్ర, శ్రీనాథ్, సతీష్, సత్యనారాయణ, భాగమ్మలపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఆర్థిక సమస్యలతో
భార్యాభర్తల మధ్య వివాదాలు
ఈనెల 13న ఆత్మహత్య చేసుకున్న భార్య
మనస్థాపంతో చేనేత రంగుల్లో కలిపే రసాయనం తాగి భర్త బలవన్మరణం
అనాథలైన ఇద్దరు చిన్నారులు