
వరంగల్ భద్రకాళికి పోచంపల్లి పట్టువస్త్రాలు
భూదాన్పోచంపల్లి: వరంగల్లోని శ్రీభద్రకాళి భద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 2న నిర్వహించే కల్యాణోత్సవానికి పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు రుద్ర శ్రీశైలం, రుద్ర చెన్నకేశవులు, రుద్ర పాండురంగశాస్త్రి కుటుంబ సభ్యులు మగ్గాలపై పోచంపల్లి ఇక్కత్ పట్టువస్త్రాలను తయారు చేశారు. 15 రోజుల పాటు శ్రమించి అమ్మవారికి చిలుకపచ్చ, సాఫ్రాన్ రంగు కల్గిన రెండు ఇక్కత్ పట్టుచీరలతో పాటు స్వామివారికి పట్టు పంచెలను తయారుచేశారు. కల్యాణం రోజు ప్రదర్శనగా వెళ్లి పట్టువస్త్రాలతో పాటు తలంబ్రాలను ఈఓ కె. శేషుభారతికి అందజేయనున్నారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తిదారుల సంఘం మాజీ అధ్యక్షుడు రుద్ర శ్రీశైలం మాట్లాడుతూ.. తాము గత ఐదు సంవత్సరాలుగా భద్రకాళి అమ్మవారికి, భద్రేశ్వర స్వామికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన దేవస్థాన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.