
ట్రావెల్స్ బస్సు ఢీకొని గేదెలు మృతి
నేరేడుచర్ల: ట్రావెల్స్ బస్సు ఢీకొని మూడు పాడి గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన మంగళవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం నుంచి తులసీ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. మార్గమధ్యలో నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలోని వీవీఆర్ స్కూల్ వద్దకు రాగానే బస్సు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెం వాసి మన్నెం వెంకన్నకు చెందిన మూడు పాడి గేదెలను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వడదెబ్బతో కూలీ మృతి
ఆత్మకూర్.ఎస్(సూర్యాపేట): ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీ తలారి నరసయ్య(59) మృతిచెందాడు. సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్లిన నరసయ్య రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని కుటుంబ సభ్యులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే రాత్రి మృతిచెందాడు.