
కోతుల దాడిలో వృద్ధుడికి గాయాలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన సండ్ర అవిలయ్య కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం అవిలయ్య తన ఇంటి బయట మంచంపై కూర్చొని ఉండగా కోతుల గుంపు ఒక్కసారిగా వచ్చి అతడిపై దాడి చేయడంతో శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం అవిలయ్యను సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారని, ఇప్పటికై నా అధికారులు కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కోదాడలో పిచ్చి కుక్క
స్వైర విహారం
● 10 మందిపై దాడి
● ఓ బాలుడికి తీవ్రగాయాలు
కోదాడరూరల్ : కోదాడ పట్టణంలో సోమవారం ఓ పిచ్చి కుక్క పది మందిపై దాడి చేసి గాయపర్చింది. పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్ 18వ వార్డులో నివాసముంటున్న కొండపల్లి రవికుమార్ కుమారుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే కుక్క గణేష్నగర్, తిలక్నగర్, ఖమ్మం క్రాస్రోడ్ ఏరియాల్లో 10 మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మునుగోడు: మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామానికి చెందిన పత్తిపాటి హజరత్(40) ఇరవై ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి వలస వచ్చాడు. అదే గ్రామానికి చెందిన కంభంపాటి లక్ష్మమ్మని 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని స్థానికంగానే నివాసం ఉంటూ తాపీ మేసీ్త్ర పని చేస్తున్నాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన హజరత్ తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం కల్వలపల్లి గ్రామ శివారులోని ముత్మాలమ్మ దేవాలయ సమీపంలో హజరత్ విగతజీవిగా కనిపించాడు. హజరత్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి పత్తిపాటి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాధు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.