కల్తీ పాలు స్వాధీనం

కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పొట్టేళ్లు 
 - Sakshi

భూదాన్‌పోచంపల్లి: మండలంలోని కప్రాయిపల్లి గ్రామంలో కల్తీ పాలు తయారుచేస్తున్న ఇంటిపై మంగళవారం ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కప్రాయిపల్లి గ్రామానికి చెందిన పాల వ్యాపారి పిండి జంగయ్య కల్తీ పాలను తయారుచేసి సొంత వాహనంలో హైదరాబాద్‌లోని హోటళ్లు, వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం ఉదయం పిండి జంగయ్య ఇంటిపై దాడి చేసి 80లీటర్ల కల్తీ పాలతో పాటు పాలలో వినియోగించే 100 మిల్లీలీటర్ల హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌, 3 కిలోల స్కిమ్‌డ్‌ పాల పౌడర్‌ను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కుక్కల దాడిలో

గొర్రె పొట్టేళ్లు మృతి

మోత్కూరు: కుక్కలు దాడిలో ఐదు గొర్రె పొట్టేళ్లు మృతిచెందగా మరో ఐదు తీవ్ర గాయాలపాలయ్యాయి. ఈ సంఘటన మోత్కూరు మండలంలోని దాచారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. దాచారం గ్రామానికి చెందిన జాల అశోక్‌, అండెం చిన పిచ్చిరెడ్డిలకు చెందిన పది గొర్రె పొట్టేళ్లపై కుక్కలు దాడి చేయడంతో ఐదు గొర్రె పొట్టేళ్లు అక్కడికక్కడే మృతిచెందాయి. మరో ఐదు తీవ్ర గాయాల పాలయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

రామగిరి(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలంలోని ఇండ్లూరు గ్రామానికి చెందిన ఔరెండి సత్యనారాయణ(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సత్యనారాయణ సోమవారం బ్యాంకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై నల్లగొండకు వెళ్తుండగా మల్లేపల్లివారిగూడెం వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో సత్యానారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి బాబాయి పేరం వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వాస ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top