కదం తొక్కిన కార్మిక లోకం
భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. శ్రామిక హక్కులపై జరుగుతున్న దాడిని ఐక్య పోరాటాల ద్వారా తిప్పుకొట్టాలని సీఐటీయూ జిల్లా పూర్వ కార్యదర్శి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసేలా లేబర్ కోడ్లు తీసుకువచ్చిందన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఏపీ ఎన్జీజీఓస్ నిరసన : మధ్యాహ్న భోజన విరామ సమయంలో భీమవరం కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీజీఓస్ ఉద్యోగులు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు యూవీ పాండు రంగారావు మాట్లాడుతూ నూతన కార్మిక చట్టాల రద్దు, వేతన సవరణ, పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ అమలు, పీఎం స్కూల్, సొసైటీ ఉద్యోగులకు 62 ఏళ్ల పదవీ విరమణ, సీపీఎస్ ఉద్యోగుల కోసం మెమో–57 అమలు తదితర డిమాండ్లు చేశారు. కార్యదర్శి పోతన సుకుమార్, సహధ్యక్షుడు శ్రీనివాసరాజు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల మూసివేత
సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలోని 1,620 అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి కార్యకర్తలు సమ్మె లో పాల్గొన్నారు. భీమవరంలో సీఐటీయూ తదితర యూనియన్లు చేపట్టిన నిరసనలు, ర్యాలీల్లో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కదం తొక్కిన కార్మిక లోకం


