కందిపోయిన సంక్షేమం
ఆకివీడు: బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలకు రెక్కలు రావడంతో కొనుగోలు చేయడం భారంగా మారింది. దీనికితోడు రేషన్ షాపుల్లో చంద్రబాబు ప్రభుత్వం కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో నిత్యావసర సరుకుల ధరలపై బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేసిన కూటమి నేతలు నేడు అధికారంలో ఉన్నా, జీఎస్టీ తగ్గినా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. కనీసం రేషన్ దుకాణాల ద్వారా కూడా కందిపప్పును సరఫరా చేయడం లేదు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.150కు చేరింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ వాహనాల ద్వారా కిలో రూ.67కు కందిపప్పును అందించేవారు. ఇది పేదలకు ఉపయుక్తంగా ఉండేది.
సరఫరాకు మంగళం : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెండు, మూడు నెలలు మాత్రమే కందిపప్పును రేషన్ షాపుల్లో విక్రయించారు. తర్వాత సరఫరా నిలిచిపోయింది. మరలా ఎప్పటినుంచి ఇస్తారనే స్పష్టత కూడా లేదు. దీంతో బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనాల్సిన పరిస్థితి.
గత ప్రభుత్వంలో ఇంటికే రేషన్
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతినెలా బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండిని ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందించేవారు. కరోనా వంటి విపత్తు సమయంలోనూ పక్కాగా సరుకులు పేదలకు చేరాయి. ప్రస్తుతం ఇంటికే రేషన్ సరఫరా నిలిచిపోగా, సరుకుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది.
రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరాకు మంగళం
బహిరంగ మార్కెట్లో ధరలకు రెక్కలు
పేదలకు తప్పని ఇబ్బందులు
గత ప్రభుత్వంలో ఇంటికే రేషన్
కందిపోయిన సంక్షేమం


