స్కూల్ బస్సు ఢీకొని బాలుడి మృతి
కొయ్యలగూడెం: స్కూల్ బస్సు ఢీకొని నేపథ్యంలో బాలుడు మృతి చెందాడు. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూలులో ఎల్కేజీ చదువుతున్న అబ్బు రిత్విక్ సాయి (4) బుధవారం స్కూల్ నుంచి బయటకు వస్తుండగా బస్సు డ్రైవర్ బస్సుని రివర్స్ చేస్తూ వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన రిత్విక్ సాయిని రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. బాలుడిది మంగపతిదేవిపేట గ్రామం. తండ్రి నాగరాజు, తల్లి శిరీషను వ్యవసాయ కూలీలుగా చేస్తుంటారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉండగా ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు గురువారం కేసు నమోదు చేశామని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవలు అందించే పరిస్థితి లేదని, ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రులు మెయింట్నెన్స్ చేయడం చాలా భారంగా ఉందని స్థానిక శేషాద్రి హాస్పిటల్ డాక్టర్ గుణ్ణం నారాయణరావు తెలిపారు. ఈ మేరకు పాలకొల్లులో గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలుపుదల చేయనున్నట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) తీర్మానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి తమ ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవలు నిలుపుదల చేస్తున్నామని స్పష్టం చేశారు.
ద్వారకాతిరుమల/దెందులూరు: శ్రీవారి క్షేత్రంలో ఒక మహిళ అదృశ్యంపై స్థానిక పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన ఆలపాటి స్వరూపా రాణి బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమలకు వచ్చింది. అయితే స్వరూపా రాణి ఆలయ ప్రాంగణంలో అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. స్వరూపారాణి ఆచూకీ తెలిసిన వారు 94407 96653 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు.
జంగారెడ్డిగూడెం: అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్జబీర్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సివిల్ సప్లయిస్ అధికారులు గురువారం పేరంపేట రోడ్డులో తనిఖీలు నిర్వహించగా హెడ్ పోస్టాఫీసు సమీపంలో ఓ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలించడాన్ని గుర్తించారన్నారు. ఈ వాహనంలో రూ.1.30 లక్షలు విలువైన 32 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీఎస్ డీటీ వెంకటేశ్వరరావు గుర్తించారు. జంగారెడ్డిగూడేనికి చెందిన కొత్తూరి బోస్, కొండూరి కాశీ ఫణికుమార్ (ఫణి), కొత్తూరి నాగేశ్వరరావు, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలకు చెందిన కొడమంచిలి బుజ్జి, కోలా మణికంఠ కుమార్లపై సీఎస్ డీటీ ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదుచేసి బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.


