
కలల వారధి కల్లేనా?
నరసాపురం: వశిష్ట గోదావరిపై నరసాపురంలో నిర్మించాలనుకున్న వంతెన నిర్మాణం సందిగ్ధంలో పడింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ 591.71 కోట్ల నిధులతో వంతెన నిర్మించడానికి గత వైస్సార్సీపీ హయాంలో టెండర్లు పిలిచారు. ఎన్నికలు రావడం, కోర్టు అడ్డంకులతో కూటమి నేతల కుట్రలతో పనులు ముందుకు సాగలేదు. ఈ నెల 11న టెండర్లు తెరవాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో టెండర్లు రద్దు చేస్తున్నట్టు ఢిల్లీలోని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే టెండర్లు తెరిచే ప్రక్రియను రికార్డు స్థాయిలో 13 సార్లు వాయిదావేసి, చివరిగా టెండర్లు రద్దు చేయడం మరో విశేషం. వంతెన నిర్మాణం జరగకుండా అడ్డుకునే క్రమంలో కూటమి నేతలు కోర్టుల ద్వారా చేస్తున్న కుట్రలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఆగస్టుకు వాయిదా పడింది. దీంతో వశిష్ట వంతెన కల నెరవేరే అవకాశాలు ఇప్పట్లో లేనట్టే.
ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై నరసాపురంలో వంతెన నిర్మించాలనేది దశాబ్దాల డిమాండ్. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందన్న తరుణంలో ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం ఆగిసోయింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టి పనిచేయడం, అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చొరవతో వంతెన నిర్మాణం ముందుకు కదిలింది. రూ 591.71 కోట్ల అంచనాతో నరసాపురం మండలం రాజుల్లంక వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్హైవేను జాతీయ రహదారిగా మార్చి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్ పాలెం, సీతారామపురం మీదుగా జాతీయ రహదారికి బైపాస్ హైవే రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు పిలిచారు. మధ్యలో కోనసీమ జిల్లా రామేశ్వరం, నరసాపురం మండలం రాజుల్లంక వద్ద వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించడం ద్వారా వంతెన కలను నిజం చేయడానికి జగన్ ప్రభుత్వం పూనుకుంది. మొత్తం 380 మీటర్ల మేర వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు. స్థల సేకరణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రూ.60 కోట్లు మంజూరు చేసింది. స్థల సేకరణ సొమ్ముతో కలసి మొత్తం రూ 651.71 కోట్లు వంతెన నిర్మాణానికి ఖర్చుచేయడానికి జగన్ సర్కార్ పూనుకుంది.
మొదటి నుంచీ కూటమి నేతల కుట్రలు
అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు ఎక్కడ వస్తుందోనని కూటమి నేతలు కొందరు కుట్రలు మొదలుపెట్టారు. కావాలని అడ్డంకులు సృష్టించడానికి స్థల సేకరణ అంశంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గట్టి ప్రయత్నం చేసి స్టేను వెకేట్ చేయించారు. కూటమి కుట్రలు కొనసాగడంతో.. వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అక్కడ కేసు క్లియర్ అయిన తరువాత గానీ మళ్లీ రీటెండర్లు పిలిచే అవకాశం లేదని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వివరణ ఇచ్చింది.
వశిష్ట గోదావరి వంతెనకు మళ్లీ అడ్డంకులు
వంతెన టెండర్లు రద్దు చేసిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ
వంతెనకు టెండర్లు పిలిచిన గత వైస్సార్సీపీ ప్రభుత్వం
రూ 591.71 కోట్లతో వంతెన నిర్మాణానికి చర్యలు
రూ.60 కోట్లతో స్థల సేకరణ పూర్తి
కూటమి నేతల కుట్రలతో వంతెన పనులకు బ్రేక్
ఇప్పటికే పనులు మొదలవ్వాలి
వశిష్ట వంతెన గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక. మా హయాంలో స్థల సేకరరణ కూడా పూర్తయ్యింది. భూమి తీసుకున్న రైతులకు చెల్లింపులు జరిగిపోయాయి. అప్పుడు వెంతెన నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వైస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచాం. ఇప్పుడు టెండర్లు తెరిచి వంతెన పనులు మొదలు పెట్టడంలో ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో అర్ధం కావడంలేదు.
– ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు

కలల వారధి కల్లేనా?