
దివ్యాంగులకు జాబ్ మేళా
భీమవరం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికలాంగ యువతకు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికై న వారు ఉద్యోగాలలో స్థిరపడి మంచిగా జీవనం కొనసాగించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్సీఎస్) ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులకు నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళాలో 14 కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మేళాకు 65 మంది హాజరు కాగా.. 45 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డాక్టర్ పి.లోకమాన్ వివరించారు.
డీఎస్సీ పరీక్షకు 81.89 శాతం హాజరు
భీమవరం: జిల్లాలోని అయిదు పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు 81.89 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. సెషన్ 1లో 580 మందికి 495 మంది హాజరుకాగా, సెషన్–2లో 276 మందికి 206 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.