
సేంద్రియ సాగుపై దృష్టి సారించండి
ఉండి: రైతులు అన్ని రకాల పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని మార్టేరు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ టీ శ్రీనివాస్ అన్నారు. ఖరీఫ్లో వరి, ఉద్యాన పంటల సంసిద్ధతపై మంగళవారం ఎన్నార్పీ అగ్రహారం కేవీకేలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పచ్చిరొట్ట, పంట మార్పిడి, జీవ ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులపైనా రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై కేవీకే ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వాటిని అవలంభించి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. రసాయన రువులు వాడకాన్ని తగ్గించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహకాన్ని అందిస్తుందని తెలిపారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్పాం, కోకో పంటను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆహార నాణ్యతకు ప్రథమస్థానం ఇచ్చి పంటలు పండించాలని కోరారు. కార్యక్రమంలో మద్రాస్ ఫెర్టిలైజర్స్ మేనేజర్ బెనర్జీ, ఎన్జీ రంగా యూనివర్సిటీ పరిశోధనా, విస్తరణ మండలి సభ్యుడు ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తండ్రిపై దాడికి కుమారుడి యత్నం
పెదవేగి : ఓ కుటుంబంలో ఏర్పడిన చిన్నపాటి వివాదం చివరికి తండ్రిపై కుమారుడు దాడికి యత్నం చేసేంత వరకు వెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన రాటాలు, చంటి తండ్రి కొడుకులు. వీరి మధ్య చిన్నపాటి వివాదం తలెత్తగా చంటి తన తండ్రి రాటాలుపై చెట్లని నరికే యంత్రంతో దాడికి యత్నించాడు. అదే సమయంలో చంటి అన్న రాజేష్ అడ్డు వెళ్లడంతో అతని చేతిపై తీవ్ర గాయమైంది. స్థానికులు రాజేష్ను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పీజీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి
భీమవరం(ప్రకాశంచౌక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్కు అందిన అర్జీల నివేదికపై మంగళవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు మున్సిపల్ సర్వే, పంచాయతీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్ అండ్బీ, విద్యుత్, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, సివిల్ సప్లయ్ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.