
బడ్జెట్లో దళితులకు తగ్గిన కేటాయింపులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో 2018–19 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్కు రూ.2,450 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.341 కోట్లు మాత్రమే కేటాయించి దళితులను మోసం చేశారని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సొంగ మధు అన్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రకటించిన పథకాలు దళితుల జీవన విధానాలకు, ఉపాధికి ఎటువంటి సబంధంలేనివని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఇచ్చిన పథకాలు – భూమి కొనుగోలు పథకం, వ్యవసాయ పనిముట్లు, రూ.50 లక్షల వరకు బ్యాంక్ లింకుడ్ స్కీమ్స్, నాన్ బ్యాంక్ స్కీమ్స్, వనరబుల్ లోన్స్, చర్మకారులకు రుణాలు, పూర్తి సబ్సిడీ రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఇచ్చే రుణాలు ఉన్నాయన్నారు. వీటితో పాటు కార్లు, గూడ్స్ వెహికల్స్, క్రేన్లు, పొక్లెయినర్లు, లారీలు, ట్రాక్టర్లు ఆటోలు, పారిశుద్ధ్య వాహనాలు, ఎస్సీల సాంప్రదాయ వ్యాపారాలు, పనులకు సంబంధించిన పథకాలు ఉండేవన్నారు. అయితే ప్రస్తుత ఎస్సీ కార్పొరేషన్లో ఆయా పథకాలు లేకపోవడం, అదే సమయంలో వీరికి ఎటువంటి సంబంధంలేని వ్యాపార పథకాలు ఇవ్వడం అంటే ఎన్నికల హామీ తప్పటమే అవుతుందన్నారు. ఈ మేరకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు ఎస్సీ కార్పొరేషన్కు విడుదల చేయాలని, ప్రస్తుతం కార్పొరేషన్ ప్రకటించిన స్థానంలోనే గతంలో అమలు పరచిన 27 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మాదిగ చర్మకారులకు గతంలో రూ. 60 కోట్లు ప్రకటించిన మాదిరిగానే ప్రస్తుతం రూ.100 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి చర్మకారులకు చెప్పుల షాపులు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఎస్సీ నాయకుడు మాముడూరి మహంకాళి ఉన్నారు.
చంద్రబాబు మోసం చేశారని, న్యాయం చేయాలని డిమాండ్
ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వినతి