
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని కుంచనపల్లి ఎంవీఆర్ టౌన్షిప్ సమీపం ఒక భవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు రూరల్ సీఐ రమేష్, ఎస్సై జేవీఎన్.ప్రసాద్ తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని, ఆరు మోటారు సైకిళ్లు, ఒక కారు, తొమ్మిది సెల్ఫోన్లు, రూ.1.63 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు.
ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు
ఏలూరు(మెట్రో): ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న 13 మంది విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో రూ.4.68 లక్షల విలువైన ల్యాప్టాప్లను జేసీ పి.ధాత్రిరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ దృష్టి లోపం, బధిరులు, చలన వైకల్యం గల విద్యార్థినీ విద్యార్థులకు ల్యాప్టాప్లను అందిస్తున్నట్టు చెప్పారు.