
‘సూర్య ఘర్’ పథకంపై అవగాహన
ఏలూరు (ఆర్ఆర్పేట): సోలార్ విద్యుత్ మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభదాయకమని, ఒక్కసారి ఖర్చుపెడితే ఇరవై ఏళ్ల పాటు విద్యుత్ బిల్లులు చెల్లించే పని ఉండదని ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పీ సాల్మన్రాజు తెలిపారు. సోమవారం స్థానిక విద్యుత్ భవన్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా గృహ విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ కల్పిస్తూ సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ తమ ఇంటిపై సోలార్ ప్యానళ్లను సబ్సిడీపై ఏర్పాటు చేసుకోవాలని, దీనికి అన్ని జాతీయ బ్యాంకులు తక్కువ వడ్డీకే సులభ వాయిదాలలో చెల్లించేలా రుణాలు అందిస్తున్నాయన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఉండాలంటే సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ పానళ్ల ఏర్పాటుకు కిలోవాట్కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.78 వేలు సబ్సిడీగా ఇస్తుందన్నారు. సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి చేసుకునే విద్యుత్లో వినియోగదారులు తాము వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను యూనిట్ రూ.2.09కు విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తాయని, దాని ద్వారా అసలు బిల్లు చెల్లించకుండా ఆదాయం కూడా వస్తుందన్నారు. ఈ సందర్భంగా సూర్యఘర్ పథకానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ పీ.రాధాకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కమర్షియల్ అండ్ టెక్నికల్ ఏ.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.