
మూలనపడిన ఆక్వా మొబైల్ ల్యాబ్
30 వేల ఎకరాల చెరువులకు పరీక్షలు ప్రశ్నార్థకం
దెందులూరు: మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పదేళ్ల క్రితం మత్స్యశాఖ ఆధ్వర్యంలో దెందులూరు, ఏలూరు రూరల్, పెదపాడు మండలాలకు సంబంధించి ఆక్వా రైతుల పొలాల మేత, ఇతర పరీక్షల కోసం మొబైల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. రైతులు ఏలూరులోని ల్యాబ్కు రానవసరంలేకుండా గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన సమావేశంలో సదస్సులు నిర్వహించి మేత, నీరు ఇతర శాంపిల్స్ తీసుకుంటారు. మొబైల్ వ్యాన్ సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి మొబైల్ ల్యాబ్లో ఉన్న టెస్టులు చేస్తారు. మిగిలిన టెస్టులకు శాంపిల్స్ తీసుకొని ఏలూరు మత్స్య శాఖ కార్యాలయానికి వచ్చి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసి రిపోర్టులను రైతులకు పంపుతారు. కొంతకాలంగా ఈ సేవలు నిలిచిపోయాయి. దీంతో దెందులూరు ఏలూరు రూరల్, పెదపాడు మండలాల్లోని 30 వేల ఆక్వా రైతుల చెరువుల్లో పరీక్షలు ప్రశ్నార్థకంగా మారాయి.
నామమాత్రంగా ల్యాబ్ సేవలు
ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు బాటలోనే ఏలూరు మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలో ఉన్న ఆక్వా ల్యాబ్ లో కూడా పరీక్షలు తూతూ మంత్రంగా ఉన్నాయి. ఆక్వాకు సంబంధించి మేత పరీక్ష ప్రాధాన్యమైంది. మేతకు సంబంధించి నాలుగు పరీక్షలు ఈ ల్యాబ్లో జరగాల్సి ఉండగా ఒక పరీక్ష మాత్రమే చేస్తున్నారు. మిషన్లు పనిచేయని కారణంగా పరీక్షలు జరగటం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇవి జరగటం లేదు.
పరీక్షలు జరగకపోతే ఎలా?
ఆక్వాలో నీరు, మేత, ఇతర పరీక్షలు చాలా ముఖ్యమైనవి. ఇవే లేకపోతే ఆక్వా సాగు లేనట్టే. ప్రభుత్వం ఆక్వా సాగుకు మద్దతు, ప్రోత్సాహం, నిధులు కేటాయింపు ఇస్తామని ఊదరగొడుతోంది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరం.
– డీబీఆర్కే చౌదరి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి
ఆక్వా రైతుల గోడు పట్టదా?
మొబైల్ ల్యాబ్ పనిచేయకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏమనాలి. జిల్లా కార్యాలయంలో ఉన్న ల్యాబ్లో టెస్టులు సైతం అరకొరగా జరుగుతున్నాయి. వెంటనే మొబైల్ ల్యాబ్ రిపేరుకు చర్యలు తీసుకోవాలి. జిల్లా కార్యాలయంలో ఉన్న ల్యాబ్లో అన్ని పరీక్షలు జరిగేలా చూడాలి.
– నిట్టా లీలా నవకాంతం, దెందులూరు జడ్పీటీసీ

మూలనపడిన ఆక్వా మొబైల్ ల్యాబ్

మూలనపడిన ఆక్వా మొబైల్ ల్యాబ్