
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నూజివీడు: మండలంలోని ముక్కొల్లుపాడులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వ్యక్తి మృతిపై మృతుడి తల్లి బండారు దుర్గమ్మ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండారు కోటేశ్వరరావు(44) పొక్లైయిన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి నూజివీడు రామాయమ్మరావుపేటకు చెందిన ప్రమీలతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రమీలకు అదే గ్రామానికి చెందిన ఇర్ల మహేష్తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై ప్రమీలకు ఆమె భర్త కోటేశ్వరరావుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో తల్లి దుర్గమ్మ కొడుకును నిద్ర లేపగా ఎంతకీ లేవకపోయే సరికి పరీక్షించగా.. మృతిచెంది ఉన్నాడు. ఆదివారం సాయంత్రం ఇర్ల మహేష్ తల్లి జమలమ్మ, మహేష్ తమ్ముడు భార్య హైమావతి కలిసి కోటేశ్వరరావుతో గొడవ పడ్డారు. కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి భోజనం పెట్టమని అడగగా భార్య పెట్టకపోవడంతో తన అన్న ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. భోజనం చేసిన కొద్దిసేపటికే కోటేశ్వరరావు వాంతులు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లి పడుకున్నాడు. తన కుమారుడి మృతి విషయంలో కోడలు ప్రమీల, ఇర్ల మహేష్పై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఎస్ఐ జ్యోతిబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.