
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
భీమవరం (ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్ (మీకోసం) లో వచ్చిన అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గడువులోపు అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అర్జీల్లో కొన్ని..
● ఇరగవరం గ్రామానికి చెందిన వీరమనేని రమాదేవి, వీరమేని కృష్ణబాబు తమకున్న ఎకరా భూమిని ఆన్లైన్ చేయాలని, దీనిపై పలుమార్లు తహసీల్దార్ను కలిసి సమస్య పరిష్కారం కాలేదని అర్జీ అందజేశారు.
● పాలకోడేరు వివేకానంద కాలనీవాసులు తమ కాలనీలో సమీపంలో బోర్లు వేసి భూగర్భ జలాలను భారీ పైపులైన్ల ద్వారా రొయ్యల పరిశ్రమకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
● అత్తిలికి చెందిన పి.లక్ష్మి తాను కాలేయ సమస్యతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నానని, ఇద్దరు పిల్లలతో జీవనం కష్టంగా మారిందని తనకు పింఛన్ అందించాలని వినతిపత్రం సమర్పించారు.
● దిరుసుమర్రు ఒకటో వార్డు వాసులు తమ ఇళ్లు పీకేసీ గతంలో గునుపూడి గ్రామంలో పట్టాలు ఇచ్చారని, అయితే ఇప్పటికీ స్థలాలు కేటాయించలేదని చర్యలు తీసుకోవాలని కోరారు.
● మొగల్తూరు మండలం ముత్యాలపల్లికి చెందిన డి.నాగేశ్వరరావు నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా పునరావాసం కల్పించేందుకు తనను ఎంపిక చేశారని, అయితే ఎటువంటి సహాయం అందలేదని, ఆర్థిక సాయం అందించాలని అర్జీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఓ కె.శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డీఎం సివిల్ సప్లయీస్ టి.శివరామ ప్రసాద్, డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
జేసీ రాహుల్కుమార్ రెడ్డి